నా బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరి వీరేంద్రనాథ్కే..మెగాస్టార్ చిరంజీవి
నా బయోగ్రఫీ రాసే బాధ్యతను యండమూరి వీరేంద్రనాథ్ అప్పగిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.

విధాత : నా బయోగ్రఫీ రాసే బాధ్యతను యండమూరి వీరేంద్రనాథ్ అప్పగిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.
లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ రుషికొండ ఏ-1 గ్రౌండ్ కన్వెక్షన్ వేదికగా ఎన్టీఆర్ 28వ పుణ్యతిది, ఏఎన్నార్ శత జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరై ప్రసంగించారు. నేను సినీ ఇండస్ట్రీలో స్టార్గా ఎదగడానికి యండమూరి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. ఆయన మేధా సంపత్తి నుంచి వచ్చిన పాత్రలే నా కెరీర్కు సోపానాలు అయ్యాయని గుర్తు చేసుకున్నారు. ఆయన సినిమాలతోనే నాకు మెగాస్టార్ బిరుదు వచ్చిందని, నా సినిమా విజయాల్లో సింహభాగం యండమూరి వీరేంద్రనాథ్ రచనలదేనన్నారు. ఆయన నా బయోగ్రఫీ రాస్తాననడం నిజంగా సంతోషంగా ఉందన్నారు.
‘అభిలాష’ నవల గురించి నాకు మొదట మా అమ్మ చెప్పిందని, అదే నవలను కేఎస్ రామారావుగారు నన్ను హీరోగా పెట్టి సినిమా తీశారని పేర్కోన్నారు. కోదండరామిరెడ్డి దర్శకత్వం, ఇళయరాజా పాటలు మంచి పేరు తెచ్చాయని, కెరీర్లో నేను సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడ్డాయని, ‘చాలెంజ్ ఎంతో మంది యువతను ప్రభావితం చేసిందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా భావించే ఎన్టీఆర్, ఏఎన్నార్లతో కలిసి పనిచేయడం నా అదృష్టమన్నారు. ప్రేక్షకులు మెచ్చేలా ఇద్దరూ పోటీపడి సినిమాలు తీశారన్నారు. ‘తిరుగులేని మనిషి’ షూటింగ్ సందర్భంగా నేనే స్వయంగా స్టంట్ చేస్తుంటే, నాకు ఒక సూచన చేశారని ఆర్టిస్టులది విలువైన జీవితం, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలన్నారని చెప్పారన్నారు. మనకు ఏదైనా జరిగితే నిర్మాత నష్టపోతాడన్నారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఉడుకురక్తం కావడంతో అన్నీ రియల్ గా చేయాలని ఆశపడుతూ ఉండేవాడిని కానీ, ఆ తర్వాత ఏడాదే ‘సంఘర్షణ’లో గాయపడి అరునెలల పాటు ఏ సినిమా షూటింగ్లోనూ పాల్గొనలేకపోయానన్నారు. పెద్దలు ఏది చెప్పినా ఆలోచించి చెబుతారని అప్పుడు అర్ధమైందన్నారు. సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ జీవితం శాశ్వతం కాదని ఎన్టీఆర్ చెప్పేవారని, విలాసవంతమైన వస్తువులు కాకుండా, ఇళ్లు, స్థలాలు కొనుక్కోమని సలహా ఇచ్చారని, దాంతో నేను పెద్ద కారు కొనాలనే ఆలోచన మాని అక్కడక్కడ స్థలాలు కొన్నాననని, అవే ఇప్పుడు నన్నూ నా కుటుంబాన్ని కాపాడుతున్నాయన్నారు. ఇక ఏయన్నార్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు ఏదైనా సరదాగా మాట్లాడేవారన్నారు. తనలోని బలహీనతలు ఏలా బలాలుగా మార్చుకున్నారో చెప్పారని, అలా వాళ్లిద్దరి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు.
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నాకు చిరకాల మిత్రులని, అన్ని రంగాల్లోనూ ఆయన రాణించారని. నాకు గురు సమానులైన ఎన్టీఆర్, ఏఎన్నార్లను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పగానే మరో ఆలోచన లేకుండా వస్తానని చెప్పి వచ్చానన్నారు. ఈ సందర్భంగా యండమూరి వీరేంద్రనాథ్ను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులతో కలిసి చిరంజీవి సత్కరించి సాహిత్య పురస్కారం, రూ.2 లక్షల నగదు చెక్కును అందించారు.ఈ కార్యక్రమంలో బెంగళూరు తెలుగు సమాఖ్య అధ్యక్షులు రాధాకృష్ణంరాజు దంపతులు, మానసిక వైద్య నిపుణులు ఇండ్ల రామసుబ్బారెడ్డి, అంతర్జాతీయ పర్యటన శాఖ నిపుణులు, కవి పండితులు టి.విల్సన్ సుధాకర్ తదితరులను సత్కరించారు. వీరికి పౌండేషన్ అందించిన జీవన సౌఫల్య పురస్కారాలు, వేర్వేరుగా 50 వేల రూపాయల నగదు చెక్కులు అందించారు. కార్యక్రమంలో ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి, ఎంపీ లావు కృష్ణదేవరాయులు, గంటా రవితేజ, దసపల్లా హోటల్ అధినేత రాఘవేంద్రరావు, పైడా కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.