BJP | కేంద్ర క్యాబినెట్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం.. జనగణనలో ‘కుల గణన’!

  • By: sr    news    Apr 30, 2025 6:06 PM IST
BJP | కేంద్ర క్యాబినెట్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం.. జనగణనలో ‘కుల గణన’!

కేంద్ర మంత్రి అశ్వినివైష్ణవ్‌ వెల్లడి

ప్రతిపక్షాలు దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్న కుల గణనను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. రాబోయే జనాభా లెక్కల సేకరణలో కుల గణనను కూడా చేర్చనున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ బుధవారం నాటి రాజకీయ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ సమావేశం అనంతరం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేయని పనిని తాము చేస్తున్నామని చెప్పిన వైష్ణవ్‌.. ఇంతకాలం జనాభా లెక్కల సేకరణ అంశాన్ని ఎందుకు వాయిదా వేస్తూ వచ్చింది, కుల గణన ఎందుకు నిర్వహించలేదు? అన్న అంశాల జోలికి పోలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కుల గణనను వ్యతిరేకించిందని మాత్రం ఆరోపించారు.

‘కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రతిసారీ కుల గణనను వ్యతిరేకించాయి. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి నిర్వహిస్తూ వస్తున్న ఏ జనాభా లెక్కల సేకరణలోనూ కుల గణనను చేర్చలేదు. 2010లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ కుల గణన అంశాన్ని క్యాబినెట్‌ పరిశీలిస్తుందని లోక్‌సభకు హామీ ఇచ్చారు. ఈ అంశంపై పరిశీలనకు మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అత్యధిక రాజకీయ పార్టీలు కులగణనకు సిఫారసు చేశాయి. అయినా కూడా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి స్థాయి కుల గణన కాకుండా.. కుల సర్వే మాత్రమే నిర్వహించింది’ అని ఆయన పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు, కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించిన అశ్వినీ వైష్ణవ్‌.. ‘సోషియో ఎకనామిక్‌ అండ్‌ కాస్ట్‌ సెన్సస్‌ (ఎస్‌ఈసీసీ)గా ఆ సర్వేను పేర్కొన్నారు. కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు కుల గణనను ఒక రాజకీయ సాధనంగా మాత్రమే వాడుకున్నాయి’ అని అశ్విని వైష్ణవ్‌ విమర్శించారు. రాజ్యాంగ ప్రకారం జనాభా లెక్కల సేకరణ కేంద్ర ప్రభుత్వం చేసే పని అని ఆయన చెప్పారు. కొన్ని రాష్ట్రాలు కులాల లెక్కలు తీసేందుకు సర్వేలు నిర్వహించాయని తెలిపారు. కొన్ని రాష్ట్రాలు వాటిని సమర్థంగా నిర్వహించగా.. మరికొన్ని రాష్ట్రాలు రాజకీయ ఉద్దేశాలతోనే వాటిని నిర్వహించాయిన ఆరోపించారు.