యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్.. సీఎం చంద్రబాబు నాయుడు

విశాఖపట్నం: ఏపీలోని విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన యోగా డే సక్సెస్ అయింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. యోగాంధ్ర సూపర్ హిట్ అన్నారు. సరికొత్త చరిత్ర సృష్టించామని తెలిపారు. 3.03 లోల మందికిపైగా వేదికవద్దకు అనుకున్న సమయానికి వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా రెండు రెండు గిన్నెస్ రికార్డులు సృష్టించటం ఇదే ప్రథమమని అన్నారు. ప్రజా చైతన్యంతోనే ఈ విజయం సాధించామని, ప్రకృతి కూడా కరుణించిందని చెప్పారు. ఈ కార్యక్రమం అనుకున్నప్పుడు సరిగ్గా ఇదే రోజున వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేశామని, అయితే.. వరుణ దేవుడు కరుణించడంతో కార్యక్రమానికి ఇబ్బంది రాలేదని చెప్పారు.
అన్ని దేశాలు గుర్తించేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యోగాంధ్రకు విశేష ప్రాచుర్యం కల్పించారని ప్రశంసించారు. ఇంత పెద్ద వేడుకను చిన్న ఇబ్బంది కూడా లేకుండా సాంకేతిక సాయంతో విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరినీ ముఖ్యమంత్రి అభినందించారు. యోగాంధ్ర పిలుపుతో అర్ధరాత్రి లేచి అన్ని వయసుల వారు వచ్చేశారన్నారు. 26 జిల్లాల్లో 26 థీమ్ బేస్ యోగా నిర్వహించామన్నారు. 100 పర్యాటక ప్రదేశాల్లో అనుకుంటే 101 చోట్ల చేశారని తెలిపారు. లక్షకు పైగా ప్రదేశాల్లో రెండున్నర కోట్లమంది యోగా చేసినట్లు వెల్లడించారు. విశాఖలో 10 ఏళ్ల క్రితం హుద్ హుద్ పరిణామాలను ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు. నాడు దీపావళి టపాసులు కాల్చొద్దంటే మానేశారని.. నేడు యోగాకు రమ్మంటే ఉత్సాహంగా తరలివచ్చారని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికీ సీఎం అభినందనలు తెలియజేశారు.
ప్రధానికి సీఎం కృతజ్ఞతలు
11వ అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. ఈ వేడుక గేమ్ చేంజర్గా నిలిచిందన్న చంద్రబాబు.. దీనికి ఒక లాజికల్ ముగింపు ఇస్తామని తెలిపారు. యోగా వల్ల కుటుంబానికి భారం కాదని.. రాష్ట్రానికి భారం కాదని గుర్తించాలన్నారు. ఇంకా పెద్ద ఎత్తున యోగాంధ్రను ప్రోత్సహిస్తామని చెప్పారు. డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి నూతన ఒరవడిలు సృష్టిస్తున్నామన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుతూ వైద్య ఖర్చులు బాగా తగ్గేలా ఈ ప్రాజెక్టు రూపొందుతోందన్నారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం పనితీరు వల్ల ప్రజా చైతన్యం పెరిగిందని ప్రధాని గుర్తించారన్నారు. వాస్తవాలు లేకుంటే ప్రధాని మాట్లాడరని.. ప్రధాని ప్రశంసలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.