ఆడాళ్ల క్రికెట్ కదా అని తక్కువ అంచనా చేసిన వాళ్లకి దిమ్మ తిరిగే షాకులు ఇస్తున్నారు.మెన్స్ క్రికెట్ కన్నా ఓ మెట్టు ఎక్కువగానే ప్రదర్శన కనబరుస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్లో చెలరేగిపోతూ వీక్షకులకి మాత్రం మంచి వినోదం పంచుతున్నారు. గత కొద్ది రోజులుగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 చాలా రంజుగా సాగుతుంది. ఎవరికి వారు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ప్లేఆఫ్స్కి వెళ్లేందుకు కృషి చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన మ్యాచ్లో ఎలిస్ పెర్రీ అద్భుతమైన బౌలింగ్తో ఆర్సీబీని ప్లే ఆఫ్స్కి చేరేలా చేసింది.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్కి మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించిన తర్వాత మాత్రం అంతగా నిలదొక్కుకోలేకపోయారు. ముంబై జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. హీలీ మాథ్యూస్(26), సజీవన్ సజన(30), ప్రియాంక బాలా(19 నాటౌట్) మాత్రమే కాస్త పరుగులు రాబట్టారు.ఎలిస్ పెర్రీ నాలుగు ఓవర్లు వేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లని పడగొట్టింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో 6 వికెట్లు తీసిన తొలి బౌలర్గా పెర్రీ నిలిచింది. ఇక లక్ష్య చేధనకు దిగిన ఆర్సీబీ 15 ఓవర్లలోనే 3 వికెట్టు కోల్పోయి 115 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన(11), సోఫీ మోలినక్స్(9), సోఫీ డివైన్(4) విఫలమైనా.. బ్యాటింగ్లోను ఎల్లిస్ పెర్రీ(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40 నాటౌట్) అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది
పెర్రీకి తోడుగా రిచా ఘోష్(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36 నాటౌట్) మంచి ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్సీబీ చక్కని విజయం అందుకొని ప్లే ఆఫ్స్కి చేరుకుంది. ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, హీలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్ తలో వికెట్ తీసారు. అయితే ప్లే ఆఫ్స్కి చేరిన జట్లలో తొలి రెండు స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఉన్నాయి. ఇప్పుడు మూడో స్థానంలో ఆర్సీబీ నిలిచింది. ఢిల్లీ మరో లీగ్ మ్యాచ్ ఆడనుండగా, ఆ జట్టు గెలిచి మంచి రన్ రేట్ మెయింటైన్ చేస్తే టాప్లో ఉంటుంది. దీంతో మరో మ్యాచ్ ఆడకుండానే ఫైనల్కి చేరుకుంటుంది. ఓడితే మాత్రం ముంబై టాప్కి వచ్చి ఫైనల్కి వెళుతుంది. డబ్ల్యూపీఎల్ టోర్నీ రూల్స్ ప్రకారం అగ్రస్థానంలో నిలిచిన టీం డైరెక్ట్గా ఫైనల్ చేరుకుంటుంది .. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ క్రమంలో ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.మరి ఆర్సీబీతో ఏ టీం తలపడనుందనేది ఢిల్లీ ఆడే లీగ్ మ్యాచ్ తర్వాత క్లారిటీ వస్తుంది.