Axiom-4 mission | భూమికి తిరుగుపయనమైన శుభాంశు శుక్లా.. 22 గంటల కీలక జర్నీ

Axiom-4 mission | ఆక్జియం 4 స్పేస్ మిషన్లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా.. సోమవారం భారతీయ కాలమానం ప్రకారం 4.50 గంటలకు అక్కడి నుంచి భూమికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆయనతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములుకూడా తిరిగి వస్తున్నారు. 18 రోజులపాటు శుక్లా.. ఐఎస్ఎస్లో వివిధ ప్రయోగాలు, పరిశోధనల్లో పాలుపంచుకున్నారు. సాయంత్రం 4.15 గంటల తర్వాత ఏ క్షణంలోనైనా అన్డాకింగ్ కోసం డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ను అంతకు ముందు పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఉంచారు. కొంత ఆలస్యమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్.. ఐఎస్ఎస్ నుంచి ఆన్డాక్ అయింది. నలుగురు వ్యోమగాములతోపాటు సుమారు 250 కేజీల కార్గోతో ఇది భూమికి బయల్దేరింది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్లో శుభాంశు, ఇతర వ్యోమగాములు జూన్ 25వ తేదీన అంతరిక్షంలోని అంతరార్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. జూన్ 28న ప్రధాని నరేంద్రమోదీతో శుక్లా మాట్లాడారు. 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత రెండో భారతీయుడిగా శుక్లా నిలిచారు. తాజా యాత్రలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కు చెందిన శుభాంశు శుక్లా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) వ్యోమగామి స్లావోజ్ ఉజ్నాన్స్కీ- విస్నివిస్కీ, పోలాండ్, హంగేరియన్ టు ఆర్బిట్ (HUNOR) వ్యోమగామి టిబోర్ కాపు, మాజీ నాసా వ్యోమగామి, ఆక్సియమ్ స్పేస్లో మానవ అంతరిక్ష ప్రయాణ డైరెక్టర్ పెగ్గీ విట్సన్ ఉన్నారు.