కేసీఆర్ను సీఎం చేయడానికి బీఆరెస్తో కలిసి బీజేపీ, ఎంఐఎం, జేడీఎస్ కుట్రలు

- పరామర్శ పేరుతో మరో డ్రామాకు తెరలేపిన డ్రామారావు
- కుమారస్వామి ప్రెస్ మీట్ను ప్రసారం చేయాలని చానళ్ల అధినేతలకు హరీశ్రావు ఫోన్
- ప్రభాకర్రెడ్డి దాడిపై రిమాండ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు
- కోడికత్తి ప్యూహాన్ని తెలంగాణలో అమలు చేసి లబ్ది పొందాలని చూస్తోన్నకేటీఆర్
- కేటీఆర్..కొడంగల్లో నన్ను ఓడించేది తరువాత ముందు సిరిసిల్లలో నీ సంగతి చూస్కో
- పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
విధాత, హైదరాబాద్: కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడానికి బీఆరెస్, బీజేపీ, జేడీఎస్, ఎంఐఎం దుష్ట చతుష్టయం కుట్ర చేస్తున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల్లో కోడికత్తి వ్యూహాన్ని అమలు చేసి సానుభూతి పొందాలని బీఆరెస్ ప్రయత్నిస్తోందన్నారు. అందుకే కేటీఆర్ 15 రోజుల్లో కుట్ర జరగబోతుందని ప్రజలకు సంకేతాలు ఇచ్చారన్నారు. అధికారం కోసం ఎంతటి దారుణానికైనా తెగబడేందుకు బీఆరెస్ సిద్ధమవుతోందన్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల ముందు ఇలాంటి దాడులే జరిగాయని తెలిపారు. 2018లో విశాఖలో ఎయిర్ పోర్టులో కోడి కత్తి దాడి జరిగిందని, 2021లో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ పై దాడి ఘటన జరిగిందన్నారు. అయితే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత దాడిలో కుట్ర లేదని తేల్చారన్నారు. తెలంగాణలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశారన్నారు. గాయపడ్డ ప్రభాకర్ రెడ్డి నడుస్తుంటే.. మంత్రి హరీష్ పరుగెత్తి సురభి డ్రామాను మించి నాటకాలాడరన్నారు. ఈ దాడి వెనక కాంగ్రెస్ ఉందని కేసీఆర్ కుటుంబమంతా ప్రచారం చేసిందని తెలిపారు. అయితే ఈ దాడిలో కుట్ర కోణం లేదని… సెన్సేషన్ కోసమే దాడి అని పోలీసులే చెప్పారన్నారు. కేసులో అరెస్టు చేసిన ఆ యువకుడి రిమాండ్ రిపోర్ట్ ఇంత వరకు ఎందుకు బయటపెట్టలేదు? అని రేవంత్ ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టకపోవడంలో అంతర్యమేంటి? అని అడిగారు. హరీష్ రావుకు… దాడికి పాల్పడ్డ యువకుడి ఫోన్ సంభాషణ ఏమైనా ఉందా? అన్న సందేహాన్ని రేవంత్ వ్యక్తం చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనలో రిమాండ్ రిపోర్ట్ వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హరీష్ అనుచరులు, రాజు కు మధ్య ఫోన్ సంభాషణ ఏమైనా ఉంటే బయటపెట్టాలన్నారు. కొడంగల్ లో నన్ను ఒడిస్తానంటున్న కేటీఆర్ ముందు సిరిసిల్లలో చూసుకోవాలని హితవు పలికారు.
పరామర్శ పేరుతో మరో డ్రామాకు తెరతీసిన కేటీఆర్
దాడులు జరుగుతాయంటున్న కేటీఆర్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కర్ణాటక నుంచి కూలి మనుషులను తెచ్చి కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తే ప్రజలు తిప్పికొట్టారన్నారు. గువ్వల బాలరాజును పరామర్శ పేరుతో డ్రామారావు మరో డ్రామాకు తెర తీశారని రేవంత్ ఆరోపించారు. కుమారస్వామి ప్రెస్ మీట్ గురించి తెలంగాణలో టీవీ ఛానళ్లు ప్రసారం చేయాలని మంత్రి హరీష్ ఆయా చానళ్లకు ఫోన్ లు చేశారన్నారు. ఆ రాష్ట్ర రాజకీయాలను ఈ రాష్ట్రంలో ప్రసారం చేయాలని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అని అడిగారు. బీజేపీతో పొత్తులో ఉన్న కుమార స్వామి ప్రెస్ మీట్ మంత్రి హరీష్ సమన్వయం చేయడం ఏంటి? అని అన్నారు.
బీఆరెస్ను అధికారంలోకి తెచ్చేందుకు తాపత్రయ పడుతున్న బీజేపీ
కేటీఆర్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంది? అని ఈసీని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రిటైర్ అయిన అధికారులపై చర్యలు చేపట్టాలని మేం ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు స్పందన లేదన్నారు. ఫోన్ లను హ్యాకింగ్ చేస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉంటుందని ఆరోపించారు. బీజేపీ స్పష్టంగా బీఆరెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోన్న కేటీఆర్
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో అసాంఘిక శక్తుల పని అని తప్పుడు కేసులుపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమండ్ చేశారు. కాంగ్రెస్ ను బదనాం చేయాలని ప్రయత్నిస్తున్న బీఆరెస్ పై చర్యలు తీసుకోవాలన్నారు. మైనారిటీలను బీసీల్లో కలుపుతారని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ మోకాలికి, బోడిగుండుకు లింకుంపెట్టి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తప్పుడు ప్రకటనలు చేస్తున్న కేటీఆర్ పై ఎన్నికల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? అని అడిగారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కాంగ్రెస్ అన్ కండిషనల్ మద్దతు
ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిటీలు ఎప్పుడో నివేదిక ఇచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ లో పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం బిల్లు పెడితే సరిపోతుందన్నారు. డిసెంబర్ 4 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నామన్నారు. వర్గీకరణ బిల్లుకు కాంగ్రెస్ అన్ కండిషనల్ మద్దతు ఇస్తుందన్నారు. కమిటీ పేరుతో మాదిగలను మరోసారి మోదీ మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దు.. బీఆరెస్ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. బీఆరెస్ నేతల్లా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై మా నాయకులు రెడ్ డైరీ లో రాసి పెడుతున్నారని, అధికారంలోకి రాగానే వారిపై చర్యలు ఉంటాయన్నారు.
“24గంటల ఉచిత విద్యుత్ పై సూటిగా సవాల్ విసురుతున్నా.. రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళదాం.. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం”.. అని రేవంత్ రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు. శకునం పలికే బల్లి కుడితిలో పడి చచ్చినట్లు కేటీఆర్ వైఖరి ఉందన్నారు.