కామారెడ్డి జిల్లాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బరిలో ఉన్నారు.
విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: కామారెడ్డి జిల్లాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బరిలో ఉన్నారు. జిల్లాకేంద్రంలోని పోలింగ్ బూత్ నెంబర్ 228, 229 వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు.
అనుమతులు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో వాహనాల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. స్థానికేతరులు కామారెడ్డి నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు భారీగా మోహరించి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. దీంతో కామారెడ్డిలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.