Cognizant | కాగ్నిజెంట్ క్యాంపస్‌కు రేపు హైదరాబాద్‌లో సీఎం శంకుస్థాపన

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ హైదరాబాద్‌లో నెలకొల్పనున్న తమ కొత్త క్యాంపస్ ను రేపు బుధవారం శంకుస్థాపన చేయనుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికుమార్‌తో చర్చలు జరిపారు

Cognizant | కాగ్నిజెంట్ క్యాంపస్‌కు రేపు హైదరాబాద్‌లో సీఎం శంకుస్థాపన

అమెరికాలో ఒప్పందం మేరకు నిర్ణయం

విధాత, హైదరాబాద్ : ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ హైదరాబాద్‌లో నెలకొల్పనున్న తమ కొత్త క్యాంపస్ ను రేపు బుధవారం శంకుస్థాపన చేయనుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికుమార్‌తో చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈనెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ముందుగానే వెల్లడించింది. హైదరాబాద్ లో 10 లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది. అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌, మిషన్ లెర్నింగ్, డిజిటల్‌ ఇంజనీరింగ్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ ఫోకస్​ చేస్తుంది. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని ఈ నెల 14వ తేదీ ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ చేరుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి అదేరోజు కాగ్నిజెంట్ కంపెనీ శంకుస్థాపనలో పాల్గొంటారు. కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్‌ కూడా హాజరవుతారు.1994లో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హైదరాబాద్‌లో 2002 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఐటీ కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంపస్​లు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 57 వేల మంది ఉద్యోగులున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్‌కు పేరుంది. గడిచిన రెండేండ్లలో ఈ కంపెనీ రాష్ట్రంలోని 34 వివిధ విద్యాసంస్థల నుంచి 7500 మంది ప్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో కాగ్నిజెంట్ కంపనీ తెలంగాణ నుంచి రూ. 7725 కోట్ల ఐటీ ఎగుమతులను నమోదు చేసింది. గడిచిన అయిదేండ్లలో కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ కింద ఈ కంపెనీ రూ. 22.5 కోట్లతో వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టింది.