రిజర్వేషన్ల రద్దు అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో సీఎం రేవంత్రెడ్డితో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా
అరెస్టుపై కాంగ్రెస్ నేతల్లో ఆందోళన
విధాత : రిజర్వేషన్ల రద్దు అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో సీఎం రేవంత్రెడ్డితో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్స్కు కలిపి ఏడుగురుకి నోటీసులు ఇచ్చారు. ఫేక్ వీడియోపై కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 153/153A/465/469/171G కింద ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మే 1న విచారణకు హాజరుకావాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం మే 29న మొదటిసారి సీఎం రేవంత్ సహా నలుగురు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నిన్నటి విచారణకు హాజరుకాకుండా న్యాయవాది ద్వారా సీఎం రేవంత్ రెడ్డి జవాబు పంపించారు. తాను ఉపయోగించే ట్విటర్ ఖాతాలో అమిత్ షా ఫేక్ వీడియో పోస్టు చేయడంగాని, రీట్వీట్ చేయడంగాని చేయలేదని తన సమాధానంలో స్పష్టం చేశారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ పేరిట ఉన్న ట్విటర్ ఖాతాలో ఈ వీడియో పోస్టు చేశారని, అలాంటప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే బాధ్యుడవుతారని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. అందుకే ఆ వీడియో సోర్స్ చెప్పాలని కోరుతూ నోటీసులు పంపినట్టు చెబుతున్నారు. అసలు ఆ వీడియో తొలుత ఎవరు సృష్టించారో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారందరిని విచారిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. ఈ క్రమంలో మరోసారి రేవంత్ సహా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకే వారు హైదరాబాద్లోనే ఉన్నారని సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా పేరుతో ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేయడంతో ఈ వివాదం రాజుకుంది.
ఇదే కేసులో హైదరాబాద్ పోలీసుల దూకుడు
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఇటు హైదరాబాద్ పోలీసులు సైతం తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. బీజేపీ నేత ప్రేమేందర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు సెక్షన్స్ 469, 505 కింద కేసు నమోదు చేశారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో మన్నే సతీష్, అస్మా, తస్లీమా, గీత, శివ, వంశీ, విష్ణులు ఉన్నారు.కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ సతీష్ తో పాటు నవీన్, తస్లీమాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రేవంత్కు అరెస్టుకేనా
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా ఫేక్ వీడియోతో పాటు సీఎం రేవంత్రెడ్డి అదే వాదనతో విస్తృత ప్రచారం చేస్తుండం పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీకి నష్టదాయకమని భావిస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. రేవంత్రెడ్డి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఫేక్ వీడియో కేసులో ఆయనను అరెస్టు చేయాలని చూస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. సీఎంను అరెస్టు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తుందంటూ, అందుకే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లో ఉన్నారంటూ ఇటు కాంగ్రెస్, అటు మిత్రపక్షం సీపీఐ నేతలు చేసిన ఆరోపణలు ఈ వివాదంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆసక్తిని రేపింది.
ఢిల్లీ హైకోర్టులో పిల్
మరోవైపు రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారన్న వివాదం నేపథ్యంలో ‘డీప్ఫేక్’ వీడియోలపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నందున డీప్ఫేక్ వీడియోల వ్యాప్తిని, ప్రసారాన్ని అరికట్టేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని న్యాయవాదుల బృందం ఈ పిల్లో కోరడం మరో ఆసక్తికర పరిణామంగా నిలిచింది.