కాళేశ్వరం సహా సాగునీటి ప్రాజెక్టులపేరిట లక్ష కోట్లు దోచుకుని అదనంగా కొత్త ఆయకట్టుకు నీరివ్వకుండా ప్రజాధనాన్ని గత బీఆరెస్ ప్రభుత్వం దుబారా చేసిందని డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు
విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం సహా సాగునీటి ప్రాజెక్టులపేరిట లక్ష కోట్లు దోచుకుని అదనంగా కొత్త ఆయకట్టుకు నీరివ్వకుండా ప్రజాధనాన్ని గత బీఆరెస్ ప్రభుత్వం దుబారా చేసిందని డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం సాగునీటి శ్వేత పత్రం చర్చలో మాట్లాడుతూ గోదావరి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాన్నిబీఆరెస్ ప్రభుత్వం రీడిజైన్లు చేసి 38వేల కోట్ల నుంచి 1లక్ష 87వేల కోట్లకు పెంచి అదనంగా ఒక్క ఎకరాకు నీరివ్వలేదని విమర్శించారు. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకుండా కాళేశ్వరం నిర్వహణకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం 25 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
పదివేల కోట్లు కరెంటు బిల్లులకు.. ప్రాజెక్టు నిర్వహణకు మరో 15 కోట్లు మొత్తం ఏటా 25 వేల కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండ కాకపోతే ఏమిటని నిలదీశారు. ఆ భారాన్ని మోయలేక లెక్కలు సరి చేయలేక తలలు పగిలిపోతున్నాయని, వాస్తవాలు వివరించేందుకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రయత్నిస్తుంటే బీఆరెస్ నేతలు పదేపదే అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో ఇందిరాసాగర్ ప్రాజెక్టుల పూర్తికి కేవలం 1,425 కోట్లు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉందని, ప్రతి ఏటా 500 కోట్లు ఖర్చు చేసిన మొదటి మూడేళ్లలోనే ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేదని, ఇందులో 75 వేల ఎకరాలు ఇతర రాష్ట్రాలకు పోయిన నికరంగా 3.25 లక్షల ఎకరాలకు ఖమ్మం జిల్లాలో సాగునీరు అందేదన్నారు.
అక్కడ సీతారామా ప్రాజెక్టు పేరుతో అంచనాలు పెంచేశారన్నారు. 28 వేల కోట్లు ప్రాణహితకు, 2, 227 కోట్లు దేవాదులకు , 200 కోట్లు ఎస్సారెస్పీ స్టేజి- 2 కు గోదావరిపై మొత్తం కలిపినా 32,848 కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో 31.30 లక్ష ఎకరాలకు సాగునీరు అందేదని, దానిని 1లక్ష 87వేల కోట్లకు పెంచారని విమర్శించారు. 2004లో ప్రభుత్వం జలయజ్ఞం పేరిట ఇదే గోదావరిపై బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి పేరిట 38 వేల కోట్లు ఖర్చు చేసి 16.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు డిజైన్ చేశారని,. ఉమ్మడిఖమ్మం జిల్లా, నల్లగొండలో కొంత ప్రాంతం మినహాయిస్తే 7 ఉమ్మడి జిల్లాలకు సాగునీరు తాగునీరు హైదరాబాద్ పరిసరాల్లోని పరిశ్రమలకు నీళ్లు ఇవ్వాలని ఆ ప్రాజెక్టులో డిజైన్ చేశారన్నారు.
కాళేశ్వరం పేరిట రీడిజైన్ చేసి లక్ష 47వేలకోట్లకు పెంచారన్నారు.. మీరు మిషన్ భగీరథ పేరిట 50 వేల కోట్లు ఖర్చు పెట్టారని, కాళేశ్వరం ఖర్చులు అదీ కలిపితే లెక్క ఎంత భయంకరంగా ఉంటుందన్నారు.94వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు నింపితే అదే కాదు..అన్నారం..సుందిళ్లలు కూడా దెబ్బ తింటాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదించారన్నారు. కాంగ్రెస్ హయాంలో మేం మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నామని ఆరోపిస్తున్నారని, ఎక్కడ ఖర్చు పెట్టారు అని అంటున్నారని, మొబలైజేషన్ అడ్వాన్స్ ఎవరికైనా లీడర్లకు ఇచ్చారా? ఇవ్వలేదు కదా? ఈపీసీ కాంటాక్ట్ ప్రకారం కాంట్రాక్టర్లకు ఇచ్చారన్నారు. మీరు 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు? అడ్వాన్సులు తీసుకున్న కాంట్రాక్టర్లతో పని చేయించాలి కదా? ప్రాజెక్టు హ్యాండోవర్ చేసుకోవాలి కదా అని భట్టి నిలదీశారు.
కూలిన ప్రాజెక్టులను ఇప్పుడు మేమే రిపేర్ చేస్తాం అంటున్నారని, అప్పుడు కూడా ఇక్కడ కూర్చొని ఎవరూ అవసరం లేదు.. మేము ఇంజనీరింగ్ చేస్తాం అని డిజైన్ చేశారు కదా… అసలు మీరు ఏం చదువుకున్నారని డిజైన్ చేస్తారని మీరేమైనా ఇంజనీరింగ్ చదివారా అని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తామని, మీరు కట్టిన డ్యాం నిట్ట నిలువునా చీలిందని, కుప్పకూలిపోయిందన్నారు. మేడిగడ్డ లేకపోతే ఇక కాళేశ్వరం ఏముందని, గోదావరి కృష్ణ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు తీసుకురాకుండా లక్షల కోట్లు దోచుకున్నారని భట్టి విమర్శించారు. ఏ నీళ్ల కోసం తెలంగాణను తెచ్చుకున్నామో ఆరాటపడ్డామో ఆ ఆరాటాన్ని బీఆరెస్ పాలకులు నీళ్లలో కలిపారని దుయ్యబట్టారు.