తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, ఆపార్టీ అభ్యర్థులకు ఓటుతో బుద్ధి చెప్పాలని అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నభం తూకి అన్నారు
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, ఆపార్టీ అభ్యర్థులకు ఓటుతో బుద్ధి చెప్పాలని అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నభం తూకి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని నభం తూకి ప్రచారం నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికే కాదు అరుణాచల్ ప్రదేశ్ కు కూడా నాయకుడేనన్నారు. రాజగోపాల్ అరుణాచల్ ప్రదేశ్లో చైనా, మయన్మార్, భూటాన్ మూడు దేశాల సరిహద్దుల్లె ఆర్మీ జవాన్ల రవాణా కోసం క్లిష్టమైన భౌగోళిక ప్రదేశంలో 250 కిలోమీటర్ల రహదారిని నిర్మించారని చెప్పారు. ఇంతదూరం నుంచి అరుణాచలప్రదేశ్ వచ్చి దేశ సైనికుల కోసం రహదారి నిర్మించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో భారతీయ జనతా పార్టీ పన్నులు పెంచి పేద ప్రజల నడ్డి విరిచిందని, ఇవన్నీ పోవాలంటే దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి పేద ప్రజలను కాపాడాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి కలిసి పని చేస్తామన్నారు. రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలిచిన తర్వాత మీ అందరిని కలవడానికి మళ్ళీ మునుగోడు కు వస్తానని చెప్పారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ సంప్రదాయ దుస్తులను బహుకరించారు.