గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం..మీర్ అమేర్ అలీఖాన్లను గవర్నర్ తమిళిసై నియమించారు
ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళి సై
విధాత : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం..మీర్ అమేర్ అలీఖాన్లను గవర్నర్ తమిళిసై నియమించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన కోదండరామ్, అమేర్ అలీఖాన్ల నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపింది. విద్యారంగానికి అందించిన సేవల నేపధ్యంలో కోదండరామ్ను, జర్నలిజానికి అందించిన సేవలకుగాను సియాసత్ ఎడిటర్ మీర్ అమేర్ అలీఖాన్ల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా వారి పేర్లను గవర్నర్ ఆమోదించారు. కాగా గత బీఆరెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల పేర్లను ప్రతిపాదించగా, రాజకీయ రంగంతో వారికున్న అనుబంధం నేపథ్యంలో వారి పేర్లను గవర్నర్ తిరస్కరించారు.
దీనిపై న్యాయస్థానంలో వివాదం కొనసాగుతుండగా తాజాగా అందుకు సంబంధించిన కేసు ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా పడింది. న్యాయ స్థానంలో ఆ కేసు కొనసాగుతుండగానే గవర్నర్ కొత్త ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను ఎమ్మెల్సీలుగా ఆమోదించడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా విద్యారంగం కోటా నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామ్ పేరును ప్రతిపాదించినప్పటికి ఆయనొక రాజకీయ పార్టీ(తెలంగాణ జన సమితి)ని స్థాపించడం, క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
గతంలో రాజకీయ నియమకాల కోణంలో బీఆరెస్ ప్రభుత్వం ఇచ్చిన పేర్లను తిరస్కరించిన గవర్నర్ తమిళి సై ఇప్పుడు కోదండరామ్ పేరును గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఆమోదించడాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.