Harish Rao : టూరిజం అభివృద్ధి పేరుతో రేవంత్ సర్కారు స్కాం
హరీశ్ రావు: రేవంత్ సర్కారు టూరిజం అభివృద్ధి పేరిట స్కాం చేస్తోన్నాడని, కమీషన్ల దందా, వట్టి డబ్బా ప్రచారం అంటూ విమర్శించారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 28(విధాత): టూరిజం అభివృద్ధి పేరుతో రేవంత్ సర్కారు స్కాం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం ముసుగులో టూరిజం అభివృద్ది పేరిట కమీషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్లాన్ వేసిందని ఆరోపించారు. ఏకంగా రూ. 15వేల కోట్ల పనులు అప్పనంగా అప్పగిస్తూ మరో స్కాంకు ప్రభుత్వం తెరలేపిందన్నారు. లక్షల కోట్లు విలువ చేసే, వేలాది ఎకరాల భూములను తన అనుయాయులకు దారాదత్తం చేసేందుకు రేవంతు మార్కు భారీ స్కెచ్ వేశారన్నారు. ఓపెన్ బిడ్లు పిలవలేదు, అధికంగా బిడ్ దాఖలు చేసిన వారికి పనులు అప్పగించాల్సి ఉన్నా ఎక్కడా నిబంధనలు పాటించలేదన్నారు.టెండర్లు పిలిచింది లేదు, నిబంధనలు పాటించింది లేదు.. కమీషన్లు దండుకునేందుకు వట్టి డంబాచారం, డబ్బా ప్రచారమన్నారు. ఇద్దరు, ముగ్గురిని మాత్రమే కన్సల్టెంట్స్ గా పెట్టుకొని పనులను సీక్రెట్ గా ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇందులో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? ప్రభుత్వ భూములను, ప్రజా ధనాన్ని ఎవరికి దోచి పెడుతున్నారని నిలిదీశారు.
లగ్జరీ వెల్ నెస్ రిసార్ట్స్, వైన్ యార్డు రిసార్ట్స్, లగ్జరీ హోటల్స్, వాటర్ ఫ్రంట్ రిసార్ట్స్, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, థీమ్ పార్కుల అభివృద్ది పేరిట మీరు చేస్తున్నది ముమ్మాటికీ స్కామే.. కమీషన్ల దందానేనని హరీశ్ రావు అన్నారు. ఈ స్కాం సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలతో సహా త్వరలో బయటపెడుతామని తెలిపారు. రేవంత్ రెడ్డి.. అధికారం శాశ్వతం కాదు, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ దోపిడీలో భాగమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ మొత్తం స్కాంపై విచారణ జరిపిస్తం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటం. పబ్లిక్ మనీని రికవరీ పెడుతమని హెచ్చరిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.