AP Govt To Deposit 15,000 For Auto Drivers | ఆక్టోబర్ 4నుంచి ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేలు సాయం: సీఎం చంద్రబాబు
ఆటో, క్యాబ్ డ్రైవర్లకు అక్టోబర్ 4 నుండి ప్రతి ఏడాది రూ.15వేలు ఆర్థిక సహాయం; ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం.

విధాత, హైదరాబాద్: అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రూ.435కోట్లు ఖర్చు చేయనున్న ఈ పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రతి ఏడాది రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. ‘ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 2,90,234 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు లబ్దిదారులుగా ఉండబోతున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వం రూ.12 వేలు మాత్రమే ఇచ్చేది.. మేం రూ. 15 వేలు ఇస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు. సూపర్ సిక్స్, మ్యానిఫెస్టో హామీల అమలుపై శాసనసభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్బంగా ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రకటించారు.
ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ప్రజల ముందుకు వెళ్లాయని..అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తామని చెప్పామన్నారు. నాడు చెప్పాం.. నేడు చేసి చూపుతున్నాం అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి నెలా ఫించన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతృప్తినిస్తోంది అన్నారు. ఇప్పుడు కొత్తగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఏదైనా కారణాల వల్లనైనా ఎవరైనా లబ్దిదారుల జాబితాలో పేరు లేకపోతే… వారి సమస్యలను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేరుస్తాం అన్నారు.