Revanth Reddy Inaugarates ATC | విద్య ఒక్కటే జీవితాలను మారుస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
65 ఏటీసీలు ప్రారంభం, యువతకు నెలకు ₹2వేలు స్కాలర్షిప్, నైపుణ్య శిక్షణ, జపాన్ ఉద్యోగ అవకాశాలు కోసం యువతకు మార్గదర్శనం.

హైదరాబాద్, సెప్టెంబర్ 27(విధాత): మల్లెపల్లి ఐటీఐ ప్రాంగణంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)ను అలాగే అలాగే రాష్ట్రంలోని 65 ఏటీసీలను వర్చువల్ సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ పునర్ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలన్నారు. ఐటీఐలను ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా 1956లో ప్రారంభించారన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదని, కోర్సులను అప్ గ్రేడ్ చేయకపోవడంతో కాలక్రమేనా ఐటీఐలు నిర్వీర్యమయ్యాయన్నారు.
మేం అధికారంలోకి వచ్చాక ఐటీఐలను పునరుద్ధరించాలని ఆలోచన చేశామని, ఇవాళ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా అప్ గ్రేడ్ చేశామన్నారు. సంకల్పంఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు.. సాధించలేనిది ఏదీ లేదని సీఎం వెల్లడించారు. మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇవాళ ప్రారంభించుకున్న 65 ఏటీసీలే నిదర్శనమని, మరో 51 ఏటీసీలను మంజూరు చేశామన్నారు. ఏడాదిలోగా 51 ఏటీసీల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
నైపుణ్యం లేకపోతే సర్టిఫికెట్లు ఎందుకూ ఉపయోగపడవని, యువతకు నైపుణ్యం అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని, యువతకు నైపుణ్యంగా అందించాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. సాంకేతిక నైపుణ్యంపై ఫోకస్ పెట్టండి… జర్మనీ, జపాన్ లు కూడా మన ముందు మోకరిల్లే రోజు వస్తుందని తెలిపారు. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది, మీ తలరాతలు మారాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని ఉపయోగించుకోండి.. సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోండని యువతకు పిలుపునిచ్చారు.
డ్రగ్స్, గంజాయి ఈ సమాజానికి పట్టిన చీడ అని, యువత వ్యసనాలకు బానిస కాకకండి.. తల్లిదండ్రులకు బాధను మిగల్చకండని తెలిపారు. ఏటీసీలలలో చదువుకున్న విద్యార్థులకు ఆర్టీసీలో అప్రంటీస్ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కి సూచిస్తున్నా, ఏటీసీలలో చదివే విద్యార్థులకు ప్రతీ నెలా రూ.2 వేలు స్కాలర్ షిప్ అందిచేలా ఆర్ధిక మంత్రిని ఒప్పించి ఇప్పించాలని మంత్రి శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
మీ సోదరుడిగా మీ భవిష్యత్ కోసం మేం ప్రణాళికలు వేస్తున్నామన్నారు. మన యువతకు జపనీస్ భాష నేర్పి అక్కడ ఉద్యోగ అవకాశాలను ఇచ్చేందుకు జపాన్ సిద్ధంగా ఉందన్నారు. మనిషికి తెలివి, పని చేసే కమిట్మెంట్ ఉంటే చాలు ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం, మీ భవిష్యత్ కు పునాదులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.