కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టిన స్మార్ట్ సిటీ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు
విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టిన స్మార్ట్ సిటీ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నగరంలోని వివిధ కూడళ్ళ వద్ద కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. కరీంనగర్ నగరం దశలవారీగా అభివృద్ధి చెందడం వల్లనే ఆటో పైలట్ కింద కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఎంపిక కాగా, అప్పటి బీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ చేసింది ఏమీ లేకున్నా తన కృషి వల్లనే ఎంపికైనట్టు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని, 30 శాతం నిధులను వినోద్ కుమార్, బండి సంజయ్ లు కూడబలుక్కొని చెరిసగం పంచుకున్నారని ఆరోపించారు. అందుకే బండి సంజయ్ నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం పాటించకుండా నాసిరంగా పనులు జరుగుతున్నా చూసీ చూడనట్టుగా వ్యవహరించారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదని, కనీసం ఫిర్యాదు కూడా చేయలేకపోయారన్నారు.
తాగునీటి అవసరాల తీర్చడం కోసం తన తండ్రి వెలిచాల జగపతిరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నగరంలోని వివిధ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకులు నిర్మించారని,పైపు లైన్లు వేశారని, ఆ ట్యాంకులే ఇప్పుడు ప్రజల దాహార్తిని తీర్చుతున్నాయని, పాలకులు మాత్రం అదనంగా కొత్త ట్యాంకులు నిర్మించలేదన్నారు. 24 గంటలపాటు నిరంతరంగా మంచినీరు అందించాల్సి ఉండగా, రెండు రోజులకోసారి నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితికి దిగజారడం పాలకుల పనితీరుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. డంప్ యార్డ్ లోని చెత్తా చెదారంతో విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న ఆలోచన వినోద్ కుమార్, బండి సంజయ్ లకు లేకపోవడం, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోకపోవడం వారి అసమర్థతకు నిదర్శనమని ఆయన విమర్శించారు. వారిద్దరికి ఎంపీగా చెరొక అవకాశం ఇచ్చారని, ఈసారి తనకూ అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని రాజేందర్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు
ఈ సమావేశాలలో సమన్వయ కమిటీ చైర్మన్, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు నడిపెల్లి అశోక్ రావు, మహమ్మద్ ఆరిఫ్ లతోపాటు ఆయా డివిజన్లకి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇన్చార్జులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.