రైతు బంధును అడ్డుకోవడం దుర్మార్గం: మంత్రి జగదీశ్ రెడ్డి

- కాంగ్రెస్ కపట ప్రేమ బట్టబయలైంది
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: రైతు బంధును ఆపెయ్యమని ఈసీకి ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి పరాకాష్ట అని, రైతులపై వారి కపట ప్రేమ బట్టబయలైందంటూ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ రద్దుల పార్టీ అని దుయ్యబట్టారు. రైతు బంధు ఆపెయమని ఫిర్యాదు చేయడం దుర్మార్గమన్నారు.
కాంగ్రెస్ చర్యలపై ప్రజలు ఉద్యమించి, తిరగబడాలన్న మంత్రి, గ్రామాల్లో ఆపార్టీ అభ్యర్థులను నిలదీయండని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తీరు ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ కూడా ఆపేలా ఉందన్నారు. కేసీఆర్ పథకాలు ఆపాలని కుట్ర చేస్తున్న కాంగ్రెస్ కు, తెలంగాణ మోడల్ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని భయం పట్టుకుందన్నారు.
కర్ణాటకలో ఏకంగా కరెంట్ కోసం సబ్ స్టేషన్లలో మొసళ్ళు వదిలే దుస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పద్దుల పార్టీ కాదు.. రద్దుల పార్టీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కేసీఆర్ పథకాలు లేవన్నారు. ఇక్కడ కేసీఆర్ పథకాలు ఆపేస్తే దేశంలో ఎక్కడా పంచాయితీ ఉండదని కుట్ర జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటే అజెండాతో ఎందుకు పని చేస్తున్నాయని ప్రశ్నించారు.
ఈ రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలు పోటీచేసే అభ్యర్ధులని ఇచ్చిపుచ్చుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసే బీఆరెస్ ను ప్రజలు గుర్తించాలని కోరారు. బీజేపీకి కేంద్రంలో రెండుసార్లు అధికారం ఇస్తే, దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చిందని విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్న బీజేపీకి అసలు అభ్యర్థులే లేరని ఎద్దేవాచేశారు.