గులాబీ జెండానే ప్రజలకు అండ: ఎమ్మెల్యే దివాకర్ రావు
60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రజలకు చేసింది ఏమి లేదని,ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని,ప్రజా సంక్షేమంకోసం అహర్నిశలు కృషి చేసే గులాబీ జెండానే ప్రజలకు నిజమైన అండ అని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమి లేదని, ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదని, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే గులాబీ జెండానే ప్రజలకు నిజమైన అండ అని మంచిర్యాల నియోజకవర్గ బీఆరెస్ ఇంచార్జ్, ఎమ్మెల్సీ భాను ప్రకాష్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని ఎస్పీఆర్ గార్డెన్ లో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరగా, ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భాను ప్రకాష్ మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో దొరికిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి, ఆ పార్టీకి ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ప్రజలకు అండగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ గులాబీ జెండాతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని వివరించారు. ఎన్నో పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. పేకాట క్లబ్ నాయకులకు అధికారం ఇస్తే మీ పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. అనంతరం జడ్పీటీసీ ముత్తే సత్తయ్య ఆధ్వర్యంలో పలు గ్రామాల నుంచి సుమారు 2వేల మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అంతకుముందు పాత బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి, జడ్పీటీసీ ముత్తే సత్తయ్య, మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, డీసీఎంఎస్ చైర్మన్ లింగన్న, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు పాదం శ్రీనివాస్,చుంచు చిన్నయ్య, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.