నారాయణ పేట నియోజకవర్గంలో బీఆరెస్ కు ఎదురుగాలి వీస్తోంది. ఎమ్మెల్యే ఐదేళ్లుగా ముఖం చాటేశారంటూ జనం ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
– ఎన్నికలప్పుడే గుర్తొచ్చామా?
– నారాయణ పేట ఎమ్మెల్యేకు నిలదీత
– అడుగడుగునా నిరసనల సెగ
– మా గ్రామాల్లోకి రావొద్దంటూ అడ్డగింతలు
– ప్రచారాల్లో రాజేందర్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: నారాయణ పేట నియోజకవర్గంలో బీఆరెస్ కు ఎదురుగాలి వీస్తోంది. ఎమ్మెల్యే ఐదేళ్లుగా ముఖం చాటేశారంటూ జనం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పడకేసిందని… మా కష్టాలు తీర్చేదెవరు అంటూ నిలదీస్తున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడే నేతలకు మా గ్రామాలు గుర్తుకు వస్తాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి, గ్రామాల్లోకి అడుగుపెట్టాలని ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. నారాయణపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా పదవి చేపట్టిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చి, చుక్కనీరైనా ఇచ్చారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
వెనుకబడిన ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోలేదు. ఇంకా ఇక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతూనే ఉన్నారు. వీరి కోసం ఇక్కడి ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా ముంబయికి బస్సులు నడుపుతున్నారంటే దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రతి రోజు ఒక బస్సు ముంబయికి వెళుతుందంటే, వలసలు ఎక్కడ తగ్గాయని ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ నేతలు, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వచ్చాక వలసలు తగ్గాయని బహిరంగ సభలో ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్న నాయకులు… నారాయణ పేట నియోజకవర్గంలోకి వస్తే కనపడుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నారాయణ పేటకు సాగునీరు వస్తుందని ప్రతి సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చెపుతూ వచ్చారు. ఈప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో వారికే తెలియదు కానీ, నారాయణ పేటకు నీరువస్తుందని ఇక్కడి రైతాంగాన్ని ఎమ్మెల్యే మభ్యపెడుతున్నారని రైతులు పెదవి విరుస్తున్నారు. జిల్లాను ఏర్పాటు చేసినామని గొప్పలు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే, కొత్త జిల్లాకు నిధులు తీసుకురావడంలో తీవ్రంగా విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొటున్నారు.
ఎమ్మెల్యేకు వరుసగా అడ్డగింతలే..
సమస్యలు ఉన్నా తీర్చకుండా మళ్ళీ ఎన్నికల ప్రచారానికి రావడంతో నారాయణ పేట నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిపై తిరగబడుతున్నారు. రెండు రోజుల నుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేను గ్రామాల్లోకి రాకుండా ప్రజలు అడ్డుకుంటున్నారు. మరికల్, ధన్వాడ, కోయిలకొండ మండల పరిధిలో పలు గ్రామాల్లో ఎమ్మెల్యేను గ్రామంలోకి అడుగు పెట్టనీయలేదు. మరికల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోకి ఎమ్మెల్యే రాకుండా అడ్డుకోవడంతో, ఎమ్మెల్యేకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రామస్థులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. అదేరోజు రాత్రి ధన్వాడ మండలంలో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేను మరోసారి అడ్డుకున్నారు. అడుగడుగునా అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అసహనానికి గురవుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి కర్ణాటక రాష్ట్రం రాయచూరు నుంచి పాలన చేస్తే ఇలాగే ఉంటుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
పథకాలన్నీ అనుచరులకేనా?
కోయిలకొండ మండలం మనికొండ గ్రామంలో శుక్రవారం ఉదయం ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను నిరసన సెగ తప్పలేదు.
గ్రామస్థులు ఎక్కడికక్కడ నిలదీశారు. స్థానిక జడ్పీటీసీ, ఇతర బీఆర్ఎస్ నేతలు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. గ్రామంలో బీఆర్ ఎస్ పార్టీకి చెందిన వారికే పథకాలు ఇచ్చారాని, నిరుద్యోగుల జీవితాల్లో ఆటలు ఆడుకుంటున్నారని యువత నిలదీశారు. ఈ క్రమంలో గ్రామస్థులు, బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ జరిగింది. మా గ్రామాల్లోకి రావద్దని మహిళలు, యువత, వృద్ధులు బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో గులాబీ నేతలకు అడుగడుగునా ప్రజలు అడ్డు తగులుతుండడంతో అయోమయానికి గురవుతున్నారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆవేశంతో గ్రామస్థులపై దురుసుగా మాట్లాడం కూడా ఆ పార్టీ నాయకులకు నచ్చడం లేదు. ఏమీ చేయలేక నాయకులు మౌనంగా ఉంటూ ఎమ్మెల్యే వెంట ప్రచారానికి వెళుతున్నారు. ఎన్నికల వేళ గుర్రుగా ఉన్న ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది సస్పెన్స్ గా మారింది.