రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామనే ఆనందంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా లేకుంటే పార్లమెంటు ఎన్నికల్లో అసలుకే ఎసరొచ్చే ప్రమాదం పొంచి ఉంది. 17 పార్లమెంటు స్థానాల్లో 14 సీట్లు గెలిచి రాహూల్ గాంధీని ప్రధానిని
(రవి సంగోజు)
విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామనే ఆనందంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా లేకుంటే పార్లమెంటు ఎన్నికల్లో అసలుకే ఎసరొచ్చే ప్రమాదం పొంచి ఉంది. 17 పార్లమెంటు స్థానాల్లో 14 సీట్లు గెలిచి రాహూల్ గాంధీని ప్రధానిని చేయాలని లక్ష్యంగా ప్రకటించుకున్న కాంగ్రెస్ ఎన్నికల కార్యాచరణ మాత్రం క్షేత్రస్థాయిలో అనుకున్నంత అమలుకు నోచుకోవడంలేదు. పదేండ్లు అధికారానికి దూరమై కండ్లుకాయలుకాచేలా ఎదురుచూసి అధికారం చేజిక్కగానే గ్రూపు తగాదాలు, ఆధిపత్యాలు నియోజకవర్గ స్థాయిలో మళ్ళీ షరామాములుగా మారాయి. దీని ప్రభావం తాజా ఎన్నికల ఫలితాలపై చూపుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కాంగ్రెస్ లోని ఈ దుష్ట సంస్కృతిని ప్రత్యర్థి పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా పావులు కదుపుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు తారుమారైతే విపక్షాలు పదేపదే శాపనార్ధాలు పెడుతున్నట్లు.. రాష్ట్రంలో మరో రాజకీయ విపరిణామాన్ని కాంగ్రెస్ చేజేతులా కొనితెచ్చుకున్నట్లేనని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. కుడి, ఎడమల రెండు పార్టీలు కాంగ్రెస్ పతనాన్ని కోరుకుంటున్న ఈ స్థితిలో అనుక్షణం ఎత్తుకు పై ఎత్తులతో వ్యవహరించాల్సిఉందని, వ్యూహాలకు మరింత పదును పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని అంటున్నారు.
ప్రత్యర్థుల నుంచి పొంచి ఉన్న ముప్పు
రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ బలమైన ప్రత్యర్థి బీఆరెస్, కేంద్ర అధికార అండతో ఉన్న బీజేపీని ఎదుర్కొనే ముందు అనుసరించాల్సిన అప్రమత్తత, ఐకమత్యం, టీమ్ స్పిరిట్ కొరవడినందున కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం నెలకొందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సీనియర్ నాయకులు సైతం ఎవరికివారుగా వ్యవహరిస్తున్నారని, ఎంతో అనుభవం ఉన్నప్పటికీ రాజకీయపాత్రను పరిమితం చేసుకుంటున్నారని భావిస్తున్నారు. వీరంతా తాము ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న పార్లమెంట్ స్థానాలకే పరిమితమై పనిచేస్తుండటంతో రేవంత్రెడ్డి ఒక్కరే ఒంటరిగా కొట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. దీని వల్ల ఆయనకు నాయకత్వ గుర్తింపు లభిస్తుందేమోగానీ, ప్రత్యర్థులను నిలదీసేందుకు ఉమ్మడి కార్యాచరణ లోపం బయటపడుతోందని అంటున్నారు. పార్లమెంటు ఎన్నికల పోలింగ్కు కావాల్సినంత సమయం ఉంది. నియోజకవర్గాల్లో నెలకొన్న లోటు పాట్లు చక్కదిద్దుకునే అవకాశం, అనుకూల అంశాలున్నందున వాటిపై టీపీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కేంద్రీకరణ చేస్తే ఫలితాలు సానుకూలంగా మారనున్నాయని, కాంగ్రెస్ ఆశించే 14 సీట్లు కాకపోయినా.. పది పన్నెండు స్థానాల్లో విజయానికి అవకాశం స్పష్టంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం
పార్లమెంటు ఎన్నికలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు, నేతలు కొందరు ఉంటున్నారు. ఇదే అహంకారంతో అధికార మత్తులోకి వెళ్ళితే పుట్టిమునగడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. చాపకింద నీరులా నియోజకవర్గాల్లో ఉన్న గ్రూపులు బహిర్గతమవుతున్నాయి. ప్రత్యర్థులపై ఉమ్మడిగా కొట్లాడాల్సిన నాయకులు నామ మాత్రపు పాత్ర నిర్వహిస్తూ నీడనిచ్చే చెట్టును నిలువునా నరుక్కుంటున్నారని పార్టీలోని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదిగా మోదీ ఎన్నికల రాజకీయం
మూడవసారి గద్దెనెక్కే లక్ష్యానికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తయిన తర్వాతనే బీజేపీ ఎన్నికల సమరశంఖం పూరించి ముందుకు వెళుతోంది. ఒక విధంగా ఏడాది కాలంగా ఎన్నికల్లో విజయానికి అవసరమైన పనులు, ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. దీనికి భిన్నంగా ఐదు నెలల క్రితమే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తాజా పార్లమెంటు ఎన్నికల వల్ల ఏడాది కాలంగా పూర్తి ఎన్నికల వాతావరణమే నెలకొన్నది. ఈ స్థితిలో పదేండ్లుగా అధికారానికి దూరమై ప్రతిపక్ష పాత్ర నెరవేర్చడానికి కూడా అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ మరింత అప్రమత్తతో వ్యవహరించాల్సి ఉంది. కష్టకాలంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో మరింత చతురతను ప్రదర్శించాల్సి ఉందని పరిశీలకులు సూచిస్తున్నారు. అంతర్గత విభేదాలు, ఆధిపత్య, అహంకార పద్ధతులు ఆ పార్టీకి నష్టం చేయడమే కాకుండా ప్రత్యర్థులకు అనుకూలంగా మారుతాయని అంచనా వేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మార్పులు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించిన ఈ ఐదు నెలల కాలంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ టార్గెట్గా బీజేపీ, బీఆరెస్ తొలిరోజు నుంచీ విమర్శలు చేపట్టాయి. వాటిని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ కొంత వైఫల్యం చెందిందనే అభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉండే ఉదాసీన వైఖరి ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. పదేండ్లు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆరెస్ ఐదునెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. వాటిని దీటుగా ఎదుర్కొనడంలో కాంగ్రెస్ నేతలు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థులకు ఉన్న ప్రచార హంగుల అండ దీనికి బాగా దోహదం చేసిందని చెబుతున్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అనుకూలంగా మార్చుకుని రెండు పార్టీలు చేసిన ప్రచార ప్రభావం ఈ ఎన్నికల్లో కొంత కనిపిస్తోంది. దీనికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు మంత్రి పదవులు, అధికారిక కార్యక్రమాలు, అధికారాన్ని అనుభవించే ఆనందంలో మునిగిపోతే బీఆరెస్, బీజేపీ మాత్రం కాంగ్రెస్ పైన విమర్శల దాడి చేపట్టారు. దీనికి రాష్ట్రంలో నెలకొన్న భౌతిక పరిస్థితులు వారికి కొంత ఉపకరించాయి.
ఆరు గ్యారంటీలే లక్ష్యంగా విపక్ష విమర్శలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్న విషయం, అధికారానికి వచ్చిన కాంగ్రెస్ కంటే అధికారాన్ని కోల్పోయిన బీఆరెస్కే ఎక్కువ తెలుసు. ఈ దీన స్థితిని బీఆరెస్ తమ విమర్శలకు వినియోగించుకుంది. బీజేపీ దీనికి వంతపాడింది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, వంద రోజుల్లో అమలుపై దాడి తీవ్రం చేశారు. కాంగ్రెస్ హామీల అమలుకు ఐదేండ్ల కాలపరిమితి ఉన్నప్పటికీ వంద రోజుల డెడ్ లైన్ వినియోగించుకుని అసెంబ్లీ ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దీనికి తోడు రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు పంటలు ఎండిపోవడం, మేడిగడ్డ కుంగిపోవడం తదితర అంశాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ వీటిన్నింటినీ ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పటికీ రైతాంగంలో సెంటిమెంటుగా మారింది. ముఖ్యంగా రైతు బంధు నిధులు అర్హులకు పూర్తిగా చేరకపోవడంతో కొంత వ్యతిరేకత నెలకొంది. దీన్ని పాలనా వైఫల్యంగా చూపెడుతున్నందున గత పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య పోలికలు సాగుతున్నాయి.
గెలిచిన ఎమ్మెల్యేల్లో నెలకొన్న అనైక్యత
అధికారంలోకి వచ్చామనే కాంగ్రెస్ అతి విశ్వాసం, ఎమ్మెల్యేల్లో ఉన్న అనైక్యత వల్ల కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ఇబ్బంది తలెత్తుతోంది. కొన్నిచోట్ల క్యాండేంట్లను ఎంపిక చేయడంలో లోటు ఉన్నట్లు భావిస్తున్నారు. ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలను కలుపుకొని పోకుండా అహంకారంతో వ్యవహరిస్తున్నందున వీరు గెలిస్తే తమ పై పెత్తనం చెలాయిస్తారని ఎమ్మెల్యేలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేల్లో నెలకొన్న గ్రూపులు, నిరాసక్తత వల్ల నష్టం వాటిల్లుతోంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే సోయి మరిచి తమ పెత్తనం ఎక్కడ పడిపోతోందనే సంకుచిత ధోరణి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారిందంటున్నారు. మంత్రులు కూడా తమ ఆధిపత్యం తగ్గుతోందని భావించి పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది క్షేత్రస్థాయి ప్రచారం పై తీవ్ర ప్రభావం కనబరుస్తోంది. సాక్షాత్తు సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లోపించిందని జిల్లా రాజకీయ పరిశీలకులు అంటున్నారు. హైదరాబాద్లో పార్టీకి పట్టు లేకపోవడం, వరంగల్ జిల్లాలో రేవూరి, కొండా మధ్య విభేదాలు, కరీంనగర్ క్యాండిడేట్ ఎంపిక విషయంలో మంత్రి పొన్నం తీరు, ఖమ్మంలో ముగ్గురు మంత్రులు మూడు దారుల్లో పయనం, భువనగిరి అభ్యర్థి ఎంపికపై కోమటి రెడ్డి బ్రదర్స్ తీరు, చేవెళ్ళ, మల్కాజ్ గిరి, పెద్దపల్లి అభ్యర్ధుల ఎంపిక తదితర అనేక అంశాలు ప్రభావం కనబరుస్తున్నాయి. ఆదిలాబాద్లో పార్టీ బలహీనంగా ఉండటం, నిజామాబాద్లో బలమైన నాయకత్వలోపం, మెదక్లో పట్టు బిగించేందుకు నెలకొన్న అడ్డంకులు ఈ ఎన్నికల్లో అంతర్గతంగా ప్రభావం కనబరుస్తున్నాయని అంటున్నారు.
మొన్ననే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని ఆర్థికంగా ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పార్లమెంటు ఎన్నికల్లో పైసల భారం మోయలేని పరిస్థితి, పార్టీ ఇచ్చే సహకారం ఇతరత్రా వనరులు పార్లమెంటు ఎన్నికల కంటే తమ అవసరాలు తీర్చుకునే ప్రమాదం పొంచి ఉన్నది. రాష్ట్రంలో ప్రధాన నేతలు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఇతర మత్రులు తమ స్థాయికి తగ్గ స్పందన లేకుండా మౌనం వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ, బీఆరెస్ విమర్శలను గట్టిగా తిప్పికొట్టడంలో ఉదాసీనత ఇబ్బందిగా మారుతుందంటున్నారు. బీజేపీ, బీఆరెస్ మధ్య అంతర్గతంగా ఐక్యత నిజమైతే, కాంగ్రెస్కు అది సంకటంగా మారనున్నది. కేసీఆర్ తమ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యమవుతుందనే వ్యాఖ్యలు ఆషామాషీవి కావని గ్రహించాలంటున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ గ్రహించినప్పటికీ ప్రచార విస్తృతిలో కొంత వెనుకంజలో ఉంది. వీటిని సరిదిద్దాల్సిన అధిష్ఠానం స్పందించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అన్ని వర్గాలను కలుపుకొనిపోవడంలో నిర్లక్ష్యం!
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఒక్క కాంగ్రెస్ పార్టీ కష్టమే కారణమని భావిస్తే పప్పులో కాలేసినట్లే. కేసీఆర్ చేజేతులా చేసుకున్న విధానాల కారణంతో పాటు, కేసీఆర్కు మద్దతు తెలిపిన అనేక వర్గాలు, శక్తుల, వ్యక్తులు తర్వాత కాలంలో ఎవరి పరిధిలో వారు ఇటు బీఆరెస్, అటు బీజేపీ పైన చేసిన విమర్శల దాడి, ముఖ్యంగా సోషల్ మీడియాలో సామాన్యుల స్పందన ఫలితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ, గెలిచిన తర్వాత తమ ఒక్కరి గొప్పతనమనే భావన కాంగ్రెస్లో కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఒకరో ఇద్దరో పౌర, ప్రజాస్వామిక, రచయిత, విద్యార్థి, యువజన, మేధావులు కాకుండా అన్ని వర్గాలు తమ పాత్ర నిర్వహించడం ఫలితంగా కాంగ్రెస్ విజయం సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఈ వర్గాల నుంచి కాంగ్రెస్ రావాల్సిన మద్దతు తగ్గిపోయింది. దీనికి ఆ పార్టీ వ్యూహాత్మక వైఫల్యమే కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా బీజేపీ పై రాజకీయ దాడి చేయడంలో నాయకులు కొంత జాప్యం చేశారు. పార్టీ శ్రేణులను కదిలించి అన్ని వర్గాలను కలుపుకుని పోవడంలో అనుసరించాల్సిన విధానంలో వైఫల్యం ఉందని ప్రజాస్వామిక వాదులంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరినీ కలుపుకుని ముందుకు సాగడంలో నాయకత్వ నిర్లక్ష్యం ఉంది. ఈ కారణాలతో పాటు బీజేపీ, బీఆరెస్ మధ్య లోపాయికారి సంబంధాలున్నాయనే విమర్శలున్నాయి. ఇదే నిజమైతే పార్లమెంటు ఎన్నికల ఫలితాల పై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.
ఇప్పటికీ సమయం మించి పోలేదు
కాంగ్రెస్ తన లోటుపాట్లు, పొరపాట్లను సరిదిద్దుకునేందుకు ఇప్పటికీ కావాల్సినంత సమయం ఉన్నందున పుంజుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ, బీఆరెస్ విమర్శలు ఏం చేస్తున్నప్పటికీ వాస్తవాలు ప్రజలకు తెలుసని, అంత సులభంగా వారి వలలో చిక్కుకునే అవకాశం లేదని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ అప్రమత్తతో లేకుంటే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సైతం ఈ చర్చ సాగుతోంది. మొన్ననే నామినేషన్ల ప్రక్రియ ముగిసినందున పార్లమెంటు ఎన్నికలకు ఈ పది రోజులు అత్యంత కీలకం కానున్నాయి. వీటిని సరిదిద్దుకుంటే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పలు స్థానాల్లో మరింత పుంజుకునేందుకు అవకాశం ఉందని ఆశించిన ఫలితాలు సాధించవచ్చంటున్నారు. కాంగ్రెస్ ఆశించిన 14 సీట్లు కాకపోయినా.. పది నుంచి పన్నెండు సీట్లలో విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.