కరీంనగర్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే విషయంలో పార్టీ నేతలుగా తమకు స్పష్టత ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పార్టీ సూచనలకు అనుగుణంగానే సోమవారం నామినేషన్ దాఖలు
*పార్టీ సూచనలకు
అనుగుణంగానే
నామినేషన్ వేయించాం
*ఎన్నికల ప్రచారంలో
సీఎంతో సహా ముఖ్య నేతలు
పాల్గొంటారు
విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే విషయంలో పార్టీ నేతలుగా తమకు స్పష్టత ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పార్టీ సూచనలకు అనుగుణంగానే సోమవారం నామినేషన్ దాఖలు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతోపాటు ముఖ్యమంత్రి పాల్గొంటారని స్పష్టత ఇచ్చారు. తనకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, లోకసభ సీటు ఆశిస్తున్న వెలిచాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ గౌడ్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుత ఎన్నికలు నిరంకుశానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్నాయని బీజేపీ , బిఆర్ఎస్ లలో ఉన్న ప్రజాస్వామ్య వాదులంతా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అధికారికంగా పార్టీ అభ్యర్థి ఎవరనే విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈరోజు లేదా రేపు ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన జరుపుతామని, తద్వారానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు.
కుల గణన ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తాము భావిస్తుంటే, ప్రధాని మోదీ ఇండ్లు గుంజుకొంటారని దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రధాని వ్యాఖ్యలను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి విచారించాలని ఆయన కోరారు.
ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పాలనలో దేశంలోని ఏ మతస్థులకు అన్యాయం జరిగ లేదని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు.
బిజెపి ఫక్తు వ్యాపారస్తుల పార్టీగా మారిందని, ఆ పార్టీ పాలనలో దళితులు ,బడుగు, బలహీన వర్గాలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనార్టీలకు న్యాయం జరగాలని మాట్లాడిన మాటలను వక్రీకరిస్తున్నారని చెప్పారు.
12 వేల కోట్లు కాదు…
కరీంనగర్ అభివృద్ధికి 1200వేల కోట్ల నిధులు తీసుకువచ్చానని బండి సంజయ్ చెప్తున్నారు, లెక్కల సంగతి పక్కన పెడితే, కనీసం 12 పనులైనా చేపట్టావా? అని ప్రశ్నించారు. సంజయ్ కుమార్ కు చదువే కాదు.. భాష కూడా లేదన్నారు. ఆయన అన్నామలై యూనివర్సిటీలో
పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని చెబుతున్నారు, కనీసం పదవ తరగతి, ఇంటర్ ఎక్కడ చదివి పాసయ్యారో చెబితే బాగుంటుందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయనను అకస్మాత్తుగా ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు.అవినీతి ఆరోపణల కారణంగానే ఆయన పదవిపోయిందన్నది లోకానికి అంత తెలుసన్నారు.. సంజయ్ ఈ విషయంలో సత్యహరిచంద్రుడినని నిరూపించుకొనే ప్రయత్నం చేయాలన్నారు.