State Sarpanches JAC | సర్పంచ్ల ఆందోళన భగ్నం..ఎక్కడికక్కడే అరెస్టులు
రాష్ట్ర సర్పంచ్ల సంఘం జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర సచివాలయం ముందు తాజా మాజీ సర్పంచ్లు తలపెట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు

విధాత, హైదరాబాద్ : రాష్ట్ర సర్పంచ్ల సంఘం జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర సచివాలయం ముందు తాజా మాజీ సర్పంచ్లు తలపెట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరవుతున్న సందర్భంలో సర్పంచ్లను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టు చేశారు. సచివాలయంవైపు ర్యాలీగా వెళ్తున్న సర్పంచ్లను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సర్పంచ్ల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం ఒత్తిడి మేరకు సర్పంచులు అప్పులు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.1500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగులో ఉన్నాయని, బిల్లులు అందక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వం అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్న ఇంకా బిల్లులు చెల్లించకపోవడం తాజా మాజీ సర్పంచులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయన్నారు. గాంధేయ మార్గంలో సచివాలయం ముందు చేయతలపెట్టిన నిరసన దీక్షకు పోలీసులు అడుగడుగున అడ్డుతగిలి అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12769 గ్రామ పంచాయతీలలో ఐదు సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచ్ల సంఘం జేఏసీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ రెడ్డి, జేఏసీ ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, వివిధ జిల్లాల, మండలాల సర్పంచుల సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.