యువతకు నైపుణ్య శిక్షణ కోసం రాష్ట్రంలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని మంత్రి, దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. నైపుణ్య శిక్షణకు సంబంధించిన
*ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని
గెలిపిస్తే మాకు మరింత బలం
ఇచ్చినట్టే!
*పెద్దపల్లి, సుల్తానాబాద్
వద్ద బైపాస్ రోడ్డు
విధాత బ్యూరో, కరీంనగర్: యువతకు నైపుణ్య శిక్షణ కోసం రాష్ట్రంలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని మంత్రి, దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. నైపుణ్య శిక్షణకు సంబంధించిన బాధ్యతలు గడ్డం వంశీకృష్ణకు అప్పగిస్తామని చెప్పారు. సోమవారం పెద్దపల్లిలో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నైపుణ్య శిక్షణలో భాగంగా యువతకు తొలి ఏడాదిలో లక్ష రూపాయలు అందజేస్తామని చెప్పారు. పెద్దపల్లి లోకసభ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే గెలిపించారు, ప్రస్తుత ఎన్నికల్లో ఎంపీని కూడా గెలిపిస్తే తమకు మరింత బలం చేకూరుతుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి రాహుల్ గాంధీ ప్రణాళికలు సిద్ధం చేశారని వివరించారు.
పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల వద్ద బైపాస్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని, త్వరలోనే వాటికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ రైతుల పేరు చెప్పి ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ కం లేదన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఈ ప్రాంత నీటి వనరుల్ని నాటి సీఎం ఇతర ప్రాంతాలకు తరలించినా, ఇక్కడి బీఆర్ఎస్ నాయకులు నోరు మూసుకొని పడి ఉన్నారని ఆరోపించారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ బానిస పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిందని, ఇక బిజెపి నుండి విముక్తి కల్పించవలసిన అవసరం ఉందన్నారు. లోకసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ విడుదల చేసిన ప్రణాళిక దేశానికి దశ దిశ చూపేలా ఉందన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ తామంతా సమన్వయంతో, సమిష్టిగా పనిచేసి పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు. విద్యావంతుడైన వంశీని గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. పెద్దపల్లి ఇండస్ట్రియల్ కారిడారుగా రూపొందడానికి ఆయన కృషి చేస్తారని హామీ ఇచ్చారు. లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే యువత ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తమ కుటుంబానికి పెద్దపల్లితో 7 దశాబ్దాల అనుబంధం ఉందన్నారు.