TELANGANA CABINET | నిరుద్యోగులకు తీపి కబురు,ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాలవ్యవధిలో ఉద్యోగ నియామకాలు : మంత్రులు పొంగులేటి, పొన్నం
నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా నిర్దిష్ట కాలపరిమితిలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ మేరకు జాబ్ కేలండర్ కు ఆమోదం తెలిపింది.

జాబ్ క్యాలెండర్ కు కేబినెట్ ఆమోదం
కోదండరాం, అమీర్ అలీఖాన్ లకు ఎమ్మెల్సీలు ఇవ్వండి
గవర్నర్ కు సిఫారసు
నిజాంషుగర్స్ పునరుద్దరణ
ధరణిపై కమిటీ నివేదిక ఇచ్చింది
నేడు అసెంబ్లీలో చర్చిస్తాం
మల్లన్న సాగర్ నుంచి జంట జలాశయాలకు గోదావరి నీళ్లు
కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం
విధాత: నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా నిర్దిష్ట కాలపరిమితిలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ మేరకు జాబ్ కేలండర్ కు ఆమోదం తెలిపింది. గురువారం అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన తరువాత అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నది. నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాల అంశంపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని సమావేశం నిర్ణయించింది. కాగా ధరణిపై వేసిన కమిటీ నివేదిక ఇచ్చిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ధరణి కమిటీ ఇచ్చిన నివేదికపై రాష్ట్రంలో ఉన్న భూమి సమస్యలపై శుక్రవారం అసెంబ్లీలో చర్చిస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం తో పాలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ లను ఎమ్మెల్సీగా నియమించాలని రాష్ట్ర మంత్రి వర్గం కోరుతూ గవర్నర్ కు ఫైల్ పంపించగా దానిని తిప్పి పంచించారు. ఈ అంశం పై చర్చించిన కేబినెట్ తిరిగి ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం ఫైల్ ను గవర్నర్ కు పంపించారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. అవసరమైతే ఇథనాల్, విద్యుత్తు ఉత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చర్చించింది. ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు అధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆ బాధ్యతలు అప్పగించింది.
రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ తో హెల్త్ కార్డులను జారీ చేయాలని కేబినేట్ చర్చించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు రెవిన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, సివిల్ సప్లయిస్ మంత్రితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది.
మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని శామీర్ పేట చెరువు ను నింపి, అక్కడి నుంచి హైదరాబాద్ లో ఉన్న జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 15 టీఎంసీలను తరలించి, అందులో 10 టీఎంసీలతో నగరం చుట్టూ ఉన్న చెరువులు నింపి, మిగతా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు.
క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్ కు, సిరాజ్ కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్ కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినేట్ తీర్మానించింది.ఇటీవల విధినిర్వహణలోచనిపోయిన అడిషనల్ డీజీ పి.మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.కేరళలో వయనాడ్ లో భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడి చాలా మంది చనిపోయారు. కేరళలో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినేట్ సంతాప తీర్మానం ఆమోదించింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసింది. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు ముందుకు వచ్చింది.