Site icon vidhaatha

Telangana Weather | తెలంగాణవాసులకు తీపికబురు..! మరో మూడురోజులు రాష్ట్రంలో వర్షాలు..!

Telangana Weather | తెలంగాణ వాసులకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. భారీ ఎండలతో ఇబ్బందులపడుతుండగా.. ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు రాగల మూడురోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్‌ తెలిపింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని తెలిపింది.

ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పింది. 22న భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ మేరకు మూడురోజుల పాటు వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. శనివారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిశాయి. హన్మకొండ, సిద్దిపేట, హైదరాబాద్‌, రంగారెడ్డిలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది.

Exit mobile version