బీజేపీ మ్యానిఫెస్టోతో ప్రజల్లో చీలిక: తమ్మినేని

– తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
విధాత: ‘తెలంగాణ బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన పలు అంశాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. ఇక్కడ అమలు చేస్తామని ప్రకటించడం ప్రజలను మోసగించడమే. ఇది ప్రజల్లో చీలిక తేవడంతో పాటు, సంక్షేమ పథకాలకు కోతకోసే మ్యానిఫెస్టో’ గా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వలేదని, విభజన చట్టాన్ని అమలు చేయలేదన్నారు. తీవ్ర ఆర్థిక దిగ్బంధానికి గురి చేసి.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్షా నిన్న ప్రకటించిన మ్యానిఫెస్టోను రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. ఈ ఎన్నికల్లో మతోన్మాద, ప్రజా వ్యతిరేక బీజేపీని, దాని మిత్రపక్షాలను ఓడించి తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగాలేవి?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2014లో రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి వాటికి ఎగనామం పెట్టిందని తమ్మినేని పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లక్షలాది ఖాళీలు నింపకుండా, ఇక్కడ ఉద్యోగాల భర్తీ చేస్తామంటే నమ్మాలా? కేంద్రంలో అధికారంలో ఉండి ద్రవ్యోల్బణాన్ని అరికట్టే అవకాశం ఉన్నప్పటికీ అరికట్టలేని బీజేపీ రాష్ట్రంలో ఎట్లా అరికడతారు? రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జాలాలను పంపిణీ చేయకుండా ప్రాజెక్టులను ఆపింది. వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ మార్కెట్లను కార్పొరేటీకరించాలని నాలుగు నల్లచట్టాలను తెచ్చింది. 23 వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే అశాస్త్రీయ మద్దతు ధర నిర్ణయించి కార్పొరేట్ వ్యాపారులకు లక్షల కోట్ల లాభాలు ఆర్జించి పెడుతున్నది.
కానీ నేడు తెలంగాణలో వ్యవసాయానికి ఎరువులు, సబ్సిడీలు, ధాన్యానికి మద్దతు ధరలు అమలుచేస్తామని ప్రకటించడం హాస్యాస్పదం’గా ఉందన్నారు. ఎఫ్సీఐ ద్వారా ధాన్య సేకరణ చేయకుండా తెలంగాణ రైతాంగాన్ని ముంచి, ఇప్పుడు రాష్ట్రంలో క్వింటాల్కు రు.3100లు ఇస్తామని చెప్తోంది. కేంద్రంలో పదేళ్ళ నుండి అధికారంలో ఉన్న బీజేపీ రు.3100లు మద్దతు ధరను ఎందుకు నిర్ణయించలేదు? గత ఎన్నికల సందర్భంగా ప్రకటించిన పసుపుబోర్డు ప్రకటనలు, శిలాఫకాలకే పరిమితమైంది. దాన్ని టర్మరిక్ సిటీ చేస్తామంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.
పార్లమెంటులో చిన్న సవరణ చేస్తే ఎప్పుడో అమల్లోకి వచ్చే ఎస్సీ వర్గీకరణకు ఇప్పుడు మళ్లీ కమిటీ వేస్తామనడం ఎన్నికల జిమ్మిక్కేనని ఖండించారు. మైనారిటీలకు అమలవుతున్న రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటే ఇది ప్రజల్లో చీలికకు ఉపయోగపడేదేతప్ప మరొకటి కాదన్నారు. మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ, విద్యారంగంలో జ్యోతిష్యాన్ని, కర్మకాండ లాంటి పాఠ్యాంశాలను చేర్చి దేశ నాగరికతను వేల సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్ళే విధానాలను అనుసరిస్తున్నదని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని బీజేపీ ప్రకటించిన ఈ మోసపూరితమైన మ్యానిఫెస్టో తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం దోహదపడదని స్పష్టం చేశారు.