CM Revanth Reddy | తెలంగాణ భవిష్యత్ మీ చేతుల్లోనే : ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖాముఖీలో సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్తును మీ చేతుల్లో పెట్టారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.

గత పాలకులు ఉపాధ్యాయులను అవమానించారు
ఈ బడ్జెట్ లో విద్యకు 10శాతం కేటాయించాలని భావించాం
హామీల అమలు దృష్ట్యా 7.3శాతం అంటే రూ.21వేల కోట్లకు పైగా కేటాయించాం
టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు.. హాని చేయాలని చూస్తే తీనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారు
తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణం
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత
విధాత, హైదరాబాద్ : తెలంగాణ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్తును మీ చేతుల్లో పెట్టారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో కొత్తగా పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖాముఖీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ భవిష్యత్ ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతానన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర కాదనలేనిదని, రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నామని, ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నామని, కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్యలాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందనుకున్నామన్నారు. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశామని, గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశామన్నారు.
విద్యకు ఆశించిన నిధులు కేటాయించలేకపోయాం
ఈ బడ్జెట్ లో విద్యకు 10శాతం కేటాయించాలని భావించామని, కానీ ఎన్నికల హామీల అమలు దృష్ట్యా 7.3శాతం అంటే రూ.21వేల కోట్లకు పైగా కేటాయించామన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 30వేల పాఠశాలల్లో.. 26లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారని, 10వేల ప్రయివేట్ పాఠశాలల్లో.. 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలల్లో మీకంటే గొప్ప టీచర్లున్నారా? అని, మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చన్నారు.
తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణం
తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా ఉందని, ఇది కఠోర నిజమని వ్యాఖ్యానించారు. టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు.. హాని చేయాలని చూస్తే తీనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారని, ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలిగించేందుకు ప్రతీ నెలా 1వ తారీఖునే జీతాలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పదిహేనేళ్లుగా పెండింగ్ లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించామని,
మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశానని తెలిపారు. తెలంగాణ భవిష్యత్ మా చేతుల్లో కాదు మీ చేతుల్లో ఉందని చెప్పేందుకే ఈ సమావేశమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నేను ఈ స్థాయికి చేరానని, అలాంటి ప్రభుత్వ టీచర్లను కలుసుకునేందుకే ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. టీచర్లంతా 90శాతం పైగా నిబద్ధతతో పనిచేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కోరారు.
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2లక్షలు తగ్గిన విద్యార్థుల సంఖ్య
గత ఏడాదికంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2లక్షలకుపైగా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గాయని, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మగౌరవమని భావించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలని సూచించారు. ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు మాకు ఎలాంటి భేషజాలు లేవని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించామని, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళలకు బాధ్యత అప్పగించామన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తు అందించాలని అధికారులను ఆదేశించామని, తెలంగాణ బలపడాలి అంటే మనందరం కార్యదీక్షతో పనిచేయాలని, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల్లో మినీ స్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగం పెరుగుతోందని, అందుకే ముచ్చెర్లలో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీలో యువకులకు నైపుణ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామన్నారు. మీరు నేర్పే విద్యనే రేపటి తెలంగాణ భవిష్యత్ కు బాటలు వేస్తుందని, పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే మీ లక్ష్యం కావాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ,ప్రొఫెసర్ కోదండరాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.