: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల చిక్కులు వీడేనా అన్న సందేలు సర్వత్రా నెలకొంటున్నాయి.
24 వేల కోట్ల విద్యుత్ బకాయిలు తెలంగాణకు వచ్చేనా
విభజన చట్టం ప్రకారం రాష్ట్ర భూ భాగంలోని ఆస్తులన్నీ తెలంగాణ కే
షెడ్యూల్ 9,10సంస్థల విభజనపై ఫోకస్
జల వివాదాలపై చర్చకు అవకాశం
బాబు చొరవపై అనుమానం వ్యక్తం చేస్తున్ బీఆరెస్
తేడా వస్తే సీఎం రేవంత్రెడ్డికే చిక్కులంటున్న సీపీఐ జాతీయ కార్యదదర్శి నారాయణ
విధాత, హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల చిక్కులు వీడేనా అన్న సందేలు సర్వత్రా నెలకొంటున్నాయి. ముఖ్యంగా భద్రాచలం పరిధిలోని పలు విలీన గ్రామ పంచాయతీలను ఏపీ నుంచి తెలంగాణ కు తీసుకు రావాలని కోరుతున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం గ్రామానికి చెత్త వేయడానికి కూడా స్థలం లేదని, అందుకే భద్రాచలానికి ఆనుకొని ఉన్న గ్రామాలను తిరిగి తెలంగాణ కు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును అడిగే అవకాశం ఉంది.
రాష్ట్ర విభజన జరిగిన తరువాత మొదటి ఐదేళ్లు ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు విభజన సమస్యల పరిష్కారంపై చొరవ చూపలేదన్న విమర్శలున్నాయి. పైగా తెలంగాణ భూభాగంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో వాటా కొట్టేయాలన్న దుర్భుద్దితో వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఆతరువాత వచ్చిన ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ కేవలం సచివాలయాన్ని మాత్రమే అప్పగించి మిగతా ఆస్తుల పంపకాల విషయంలో అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. కాగా తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆరెస్ ప్రభుత్వం కూడా ఏపీ కేసులు వేసి స్టేలు తెస్తుంటే కౌంటర్ లు దాఖలు చేయడంలో అలసత్వ ప్రదర్శించిందన్న విమ ర్శలున్నాయి. అయితే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటిన తరువాత విభజన చట్టం ప్ర కారం లొకేషన్ బేస్డ్ అసెట్స్ అన్ని ఏ రాష్ట్ర భూ భాగంలో ఉన్నవి ఆ రాష్ట్రానికే చెందుతాయి. ఈ చట్టం ప్రకారం తెలంగాణ భూ భాగంలో ఉన్న సంస్థలు, వాటి ఆస్తులన్నీ తెలంగాణ కే చెందుతాయి. కానీ దీనికి విరుద్దంగా చంద్రబాబు దిల్, ఆర్టీసీ తదితర సంస్థలకు జీహెచ్ ఎంసీ పరిధిలో ఉన్న విలువైన భూముల్లో వాటా కోరే ప్రమాదం ఉందన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. విభజన చట్టం ప్రకారం తెలంగాణ భూ భాగంలో ఉన్న సెంటు భూమిని కూడా వదులు కోవద్దని కోరుతున్నారు.
ప్రజా భవన్ వేదికగా…
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సమయం దగ్గర పడింది. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజా భవన్ వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఆరో తేదీన భేటీ అవుదామనే ప్రతిపాదనను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందుంచారు , అందుకు అంగీకరించిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రజాభవన్ వేదికగా నేడు భేటీకి మూహుర్తం ఖరారు చేశారు. ఈ భేటీలో ఏ అంశాలపై చర్చ సాగనుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారమే హైదరాబాద్ చేరుకుని జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మకాం వేశారు.
రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం గతంలో పలుసార్లు అధికారికంగా చర్చలు జరిగినప్పటికి సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో ఈ దఫా చంద్రబాబు, రేవంత్రెడ్డిల భేటీపై ప్రజల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గడువు ముగిసిపోయిన నేపథ్యంలో విభజన సమస్యలపై జరగనున్న చర్చలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. గతంలో కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్షా సారధ్యంలో జరిగిన సదరన్ జోన్ కౌన్సిల్ సమావేశాలతో పాటు రెండ రెండు రాష్ట్రాల మధ్య 30సమావేశాలు జరిగిన విభజన వివాదాలు పదేళ్ల నుంచి పరిష్కారం కాలేదు. తరచుగా ఆస్తుల పంపకం, అప్పుల చెల్లింపు, జల వివాదాలపై రెండు రాష్ట్రాల మధ్య తగాదాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం జరిగే భేటీపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. భేటీలో చర్చించాల్సిన ఎజెండా అంశాలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు కసరత్తుతో సిద్ధమయ్యాయి.
తెలంగాణ ఆస్తులపై కన్నేసిన ఏపీ మరో మారు తమకే తెలంగాణ నుంచి ఆస్తులు, నగదు నిల్వలు రావాలని బుకాయించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ అధికారులు తెలంగాణ నుంచి బకాయిలు రావాలన్న తీరుగా చిట్టా పద్దు తయారు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ముందుగా పరిష్కారానికి వీలున్న సమస్యలపై నేటీ భేటీలో రెండు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకునే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా షెడ్యూల్ 9,10లలో ఉన్న సంస్థల విభజన పై చర్చించే అవకాశముందని అధికార వర్గాల సమాచారం. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక సీఎం రేవంత్రెడ్డి విభజనకు సంబంధించి పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టగా, గత మార్చిలో డిల్లీలో ఏపీ భవన్ వివాదాన్ని పరిష్కరించుకోలిగారు. ఇటీవలే మైనింగ్ కార్పోరేషన్ నిధుల పంపిణీ వివాదం సైతం పరిష్కరించుకున్నారు.
బాబు చొరవపై సందేహం వ్యక్తం చేస్తున్న బీఆరెస్
మరోవైపు నేటీ సీఎంల భేటీలో గతంలో ఏపీ లాగేసుకున్న ఏడు మండలాలను,లోయర్ సీలేరు ప్రాజెక్టును తిరిగి తీసుకునేలా ప్రయత్నించాలని ప్రతిపక్ష బీఆరెస్ కోరుతుండగా, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు భద్రాచలం పరిధిలోని ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో విలీనం చేసేలా చూడాలని కోరారు. సమైక్యవాది చంద్రబాబుతో గతంలో టీడీపీ పాత సహచరుడిగా, శిష్యుడిగా ముద్రపడిన సీఎం రేవంత్రెడ్డి జరుపుతునున్న ఈ భేటీని బీఆరెస్ డేగ కళ్లతో పరిశీలిస్తుంది. ఏపీకి సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంతో పాటు గత పదేళ్లుగా విభజన సమస్యలపై చొరవ చూపని చంద్రబాబు ఇప్పుడెందుకు భేటీతో హడావుడి చేస్తున్నారన్న సందేహాలను బీఆరెస్ లేవనెత్తుతుంది. నిజంగా చంద్రబాబు, రేవంత్ల మధ్య విభజన సమస్యల ఎజెండా ఉందా లేక మరేదైనా గూడుపుఠాణి ఉందా అంటూ బీఆరెస్ ప్రశ్నిస్తుంది. చంద్రబాబుతో భేటీలో విభజన సమస్యల పరిష్కారం పేరుతో తెలంగాణ ప్రయోజనాల విషయమై రేవంత్రెడ్డి ఏ మాత్రం తగ్గినా రాజీ పడినా దాన్ని తెలంగాణ సెంటిమెంట్ కోణంలో బీఆరెస్ అవకాశంగా మలుచుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9 పరిధిలోని 91 ప్రభుత్వరంగ సంస్థల విభజనపై రెండు రాష్ట్రాల మధ్య 53 సంస్థల విభజనపై ఎలాంటి పేచీ లేకపోయినా, మిగిలిన 15ప్రభుత్వ సంస్థల విభజనపై తెలంగాణ గతంలోనే సానుకూలత తెలపగా, 23సంస్థల ఆస్తుల పంపకాలపై ఏపీ అభ్యంతరం తెలిపింది. పలు సంస్థలకు సంబంధించి హైకోర్టులో కేసులుండగా, వాటిపై గతంలో జరిగిన చర్చలు ఫలించలేదు. పెండింగ్లో ఉన్న సంస్థల విభజనపై షీలా బీడే కమిటీ సిఫారసులపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్(దిల్) సంస్థకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరిలతో పాటు తెలంగాణ జిల్లాల్లో ఉన్నభూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయగా, ఏపీ ప్రభుత్వం అక్కడి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాల్లో ఉన్న దిల్ ఆస్తుల విభజన చేయాలని నిపుణల కమిటీ చేసిన సిఫారసులను తెలంగాణ వ్యతిరేకిస్తుంది. ఏపీ ఫైనాన్స్ కమిషన్ విభజన మరో చిక్కు ముడిగా తయారైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని వేలకోట్ల విలువైన 238ఎకరాల భూములను కమిషన్ నుంచి తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయగా, 2015లో ఏపీ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. హైదరాబాద్ లోని ఆర్టీసీ ఆస్తుల పై ఏపీ మడత పేచీ పెడుతోంది.
షెడ్యూల్ 10సంస్థల విభజనపై పీటముడి
షెడ్యూల్ 1-లోని 142ప్రభుత్వం రంగం సంస్థల విభజన సైతం రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లోనే కొనసాగుతుంది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఏపీ వ్యవహరిస్తోంది. ఏపీ ఉన్నత విద్యామండలి కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు గతంలో తెలంగాణ అంగీకరించగా, జనాభా ధామాషా ప్రకారం నగదు నిల్వలను ప్రాంతం ఆధారంగా స్థిరాస్తులను పంపకం చేయాలని కేంద్రం మార్గదర్శకాలలో సూచించింది. దీనిపై ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు పెండింగ్లో ఉంది. 10వ షెడ్యూల్లోని తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30సంస్థలపై పంపిణీపై వివాదాలు నెలకొన్నాయి. పౌరసరఫరాల సంస్థలో కేంద్రం నుంచి తెలంగాణ కు వచ్చిన సబ్సీడీని ఏపీ వాడుకున్నది. ఈ సబ్సీడీని తెలంగాణకు ఇవ్వకుండా ఏపీ కుటిల యత్నాలు చేస్తోంది. పై గా తెలంగాణ కొంగు బంగారం సింగరేణిలో వాటా అడుగుతోంది. దీని అనుబంధ సంస్థ ఆప్మెల్ను తెలంగాణకు ఇవ్వకుండా ఏపీ కుటిల యత్నాలు చేస్తోంది.
వేలకోట్ల విద్యుత్తు బకాయిలు
విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు రూ. 24 వేల కోట్లు తెలంగాణకు ఏపీ నుంచి రావాల్సి ఉంది కానీ ఏపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమే తమకు రూ. 7 వేల కోట్లు ఇవ్వాలని బుకాయిస్తోంది. విద్యుత్తు బకాయిలపై నెలకొన్న పేచీ నేటీ సీఎంల భేటీలో తెగుతుందో లేదో చూడాల్సివుంది.
జఠిలంగా జల వివాదాలు
ఏపీ తెలంగాణల మధ్య ఆస్తులు, అప్పుల వివాదాల కంటే జల వివాదాలు సెంటిమెంట్తో ముడిపడి తరుచు రెండు రాష్ట్రాల మధ్య రచ్చకు కారణమవుతున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలో రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల తెలంగాణ, పాలమూరు-రంగారెడ్డిపై ఏపీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 39మేరకు విచారించిన బ్రిజేశ్కుమార్ ట్రిబ్యూనల్ తీర్పు పదేళ్లుగా పెండింగ్లో ఉండిపోగా, మరో ట్రిబ్యూనల్ ఏర్పడినా వివాద పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నిర్వాహణ..హక్కులపై వివాదాలు ముదిరిపోగా సమస్య కేఆర్ఎంబీ చేతికి వెళ్లింది. కృష్ణా జలాల్లో వాటాలపై పేచీ సాగుతుండగా, రెండు రాష్ట్రాల సీఎంల మధ్య జరుగనున్న చర్చల్లో జల వివాదాలు కీలకం కాబోతున్నాయి.
ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చేనా
రెండు రాష్ట్రాల మధ్య సమస్యలలో ఉద్యోగుల విభజన అంశం మరో కీలకాంశంగా ఉంది. ఇప్పటికే కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్కడి వారు ఇక్కడ.. ఇక్కడి వారు అక్కడ అనే రీతిలో పని చేస్తున్నారు. ఏపీకి అలాట్ చేసిన వారు కూడా తెలంగాణలో పని చేస్తున్న పరిస్థితి. అలాంటి వారి విషయంలో ఏం చేయాలనే దానిపై క్లారిటీకి రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగుల కోరుతున్నారు. ప్రస్తుతం ఏపీలో 712 మంది స్థానికత ఉన్న ఉద్యోగులు పని చేస్తున్నారు. సచివాలయం, హెచ్ ఓ డీలు, 9, 10వ షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని కోరుతోన్నారు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు, సీనియార్టీ కొల్పోయినా ఫర్వాలేదని.. తమను తమ రాష్ట్రానికి పంపాలని తెలంగాణ ఉద్యోగులు అంటున్నారు. విభజన జరిగి పదేళ్లైనా స్థానికత ఆధారంగా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై తెలంగాణ ఉద్యోగుల ఆవేదన చెందుతున్నారు. తమ విజ్ఞప్తులను పరిష్కరించాలని రెండు రాష్ట్రాల సీఎంలను అభ్యర్థిస్తున్నారు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు. ఈ విషయం మీద సీఎంల భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు