అక్టోబర్ 3న ఈసీ సభ్యుల పర్యటన.. అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలి: రాష్ట్ర అధికారులకు సీఎస్ ఆదేశం

విధాత, హైదరాబాద్: ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు అక్టోబర్ 3న రాష్ట్రంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తెలిపారు. అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని ఆమె ఆదేశించారు. ఈసీ అధికారుల రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం సీనియర్ అధికారులతో సీఎస్ సమీక్షించారు. మూడు రోజుల పాటు హైదరాబాద్లోనే పర్యటిస్తారన్నారు. ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు/సీపీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, అధికారులు అన్ని వివరాలను ఒకే పద్ధతిలో అందించాలని సూచించారు. ఈ సమావేశంలో సీఈవో వికాస్ రాజ్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోం శాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వీ కరుణ, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అశోక్రెడ్డి పాల్గొన్నారు.