Coffin Sessions | మరణానికి ముందే శవపేటికలో గడుపుతున్న యువత.. ఏంటీ ఈ ట్రెండ్!

Coffin Sessions | జపాన్‌, థాయ్‌లాండ్‌లో వినూత్న ట్రెండ్ ఇప్పుడు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటుంది. మరణానికి ముందే శవపేటికల్లో 30 నిమిషాలు గడపడం ద్వారా చావు భయాన్ని జయించి, జీవితం విలువను నేర్చుకుంటున్నారు.

Reported by: Chandram | వైరల్ న్యూస్ | Apr 03, 2026, 8:49 pm IST
Read Time: 5 mins
Coffin Sessions | మరణానికి ముందే శవపేటికలో గడుపుతున్న యువత.. ఏంటీ ఈ ట్రెండ్!

Coffin Sessions | మరణం అంచున నిలబడినప్పుడే మన అసలైన జీవితమేంటో తెలుస్తుంది. మనం చేసిన తప్పులు.. పోగొట్టుకున్న అవకాశాలను గుర్తుచేస్తాయి. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉండదు. అందుకే చావు భయాన్ని ముందే రుచి చూపించి, జీవితంపై ఒక స్పష్టత కల్పించే వినూత్న థెరపీ ఇప్పుడు జపాన్‌లో ట్రెండింగ్‌గా మారింది. అదే. కాఫిన్ సెషన్స్. చనిపోవడానికి ముందే శవపేటికలో కొంతసేపు పడుకునే అనునభవం ద్వారా జీవితం విలువను తెలుసుకునేలా చేసే ఈ ప్రయోగం ఇప్పుడు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటుంది.

టోక్యోలోని పలు వెల్‌నెస్ సెంటర్లు, ఫ్యునరల్ హోమ్స్ ఈ కాఫిన్ సెషన్స్ సేవలను అందిస్తున్నాయి. ఈ సెషన్‌లో భాగంగా ఒక చీకటి గదిలో పూలతో అలంకరించిన శవపేటికను ఏర్పాటు చేస్తున్నారు. మనం అందులో పడుకోగానే దాని మూతను గట్టిగా మూసివేస్తారు. అప్పుడు ఆ శవపేటికలో చిమ్మచీకట్ల నడుమ నిశ్శబ్ద వాతావరణంలో దాదాపు 30 నిమిషాలు గడుపాలి. కావాలంటే సంగీతంతో రిలాక్స్ అయ్యే వెసులుబాటు కూడా కల్పిస్తారు. ఇలా గాఢాంధకారంలో ఏకాంతంగా గడపడం వల్ల మనిషికి తన అంతరాత్మతో మాట్లాడే అవకాశం లభిస్తుందని.. అప్పుడు మనలోని అనవసరపు భయాందోళనలకు సమాధానాలు దొరుకుతాయని నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ ట్రెండ్‌ 2024లో మొదలైంది. జపాన్‌లో శతాబ్దాలుగా సేవలందిస్తున్న ఫ్యునరల్ హోమ్ కేఫిన్ కేఫ్ సర్వీస్‌ను ప్రారంభించింది. చావు భయాన్ని తగ్గించి, జీవితం పట్ల కొత్త ఆలోచనలు కల్పించడమే లక్ష్యంగా కేఫె సెషన్ ప్రారంభించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. థాయ్‌లాండ్‌లో కూడా డెత్ ఫెస్ట్‌తో జరిగే ఈవెంట్లు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో పాల్గొనే వారు.. వివిధ సైజులు, డిజైన్లు ఉండే శవపేటికల్లో పడుకుని.. అందులో ఉన్న అద్దంలో తమను తాము చూసుకుంటూ జీవితం గురించి ఆలోచించుకుంటున్నారు. దీనివల్ల మనిషి ఆలోచనల్లో చాలా మార్పు వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. నిజంగానే నేను చనిపోతే.. నా ఫ్యామిలీ, నన్ను నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఏంటని ఎక్కువ మంది ఆలోచిస్తున్నారట.. అందుకే వారి కోసం ఏదైనా చేయాలనే బాధ్యత వారిలో పెరుగుతుందని నిర్వాహకులు విశ్లేషిస్తున్నారు.

అయితే, ఈ వినూత్న ట్రెండ్‌పై మానసిక ఆరోగ్య నిపుణులు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మానసికంగా దృఢంగా ఉండే వాళ్లు ఇలాంటి సెషన్‌లో పాల్గొనడం వల్ల, వారిలో జీవితంపై అవగాహన పెంచుతుంది.. కానీ మానసికంగా బలహీనంగా ఉన్న వారిలో ఇది నెగెటివ్‌గా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సరైన మార్గదర్శకం లేకపోతే.. నిరాశ, ఒంటరితనం, భయం వంటి భావాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ఈ సెషన్‌లో పాల్గొనేముందు మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read More:

పాకిస్తాన్‌లో పెట్రో ధరలు చూస్తే దిమ్మతిరగడం ఖాయం..

కల్తీ మామిడి పండ్లు వస్తున్నాయ్.. తస్మాత్ జాగ్రత్త!