మోదీ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం

విధాత‌:కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌ వేదికగా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి విస్తరణ ఇదే. కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి, సమీప భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో భారీ విస్తరణకు ప్రధాని మోదీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 22 మంది కొత్తవారికి అవకాశం లభిస్తుందని సమాచారం. ఆయా […]

మోదీ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం

విధాత‌:కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌ వేదికగా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి విస్తరణ ఇదే. కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి, సమీప భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో భారీ విస్తరణకు ప్రధాని మోదీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 22 మంది కొత్తవారికి అవకాశం లభిస్తుందని సమాచారం. ఆయా రాష్ట్రాల రాజకీయ కారణాల వల్ల జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్‌), సుశీల్‌కుమార్‌ మోదీ (బిహార్‌), సర్బానంద సోనోవాల్‌ (అసోం)లకు కేంద్ర కేబినెట్‌లో బెర్తులు ఖరారైనట్లు తెలుస్తోంది

ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపుర్‌ రాష్ట్రాలకు 2022లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తారన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఎక్కువ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గంలో యూపీ నుంచి ఉన్న 9 మందిలో నలుగురైదుగురికి స్థానచలనం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. రీటా బహుగుణ జోషికి అవకాశం వస్తే అదే సామాజికవర్గానికి చెందిన నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండేకి ఉద్వాసన ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. యూపీ నుంచి అవకాశం దక్కే అవకాశాలున్నవారిలో జోషితో పాటు, అజయ్‌మిశ్ర, సకల్‌దీప్‌ రాజ్‌భర్‌, పంకజ్‌ చౌదరి, రాంశంకర్‌ కతేరియా, వరుణ్‌గాంధీ, రాజ్‌వీర్‌సింగ్‌, అప్నాదళ్‌ నేత అనుప్రియ పటేల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.

మాయావతి, ప్రియాంక గాంధీ వంటి మహిళా నేతలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కేబినెట్‌ నుంచి తప్పించి, యూపీలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు- ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడకు ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలనుంచి పెద్దగా మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చని సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్‌ నరసింహారావు పేరు మాత్రం వినిపిస్తోంది.

జేడీయూ లోక్‌సభాపక్ష నేత రాజీవ్‌ రంజన్‌, ఎల్‌జేపీ నుంచి రాంవిలాస్‌ పాసవాన్‌ సోదరుడు పశుపతి కుమార్‌ పారాస్‌కు స్థానం కల్పించనున్నట్లు సమాచారం. పారాస్‌కు స్థానం కల్పించవద్దని పాసవాన్‌ తనయుడు చిరాగ్‌ ప్రధానిని కోరారు. ఎల్‌జేపీ సభ్యులుగా ఎవరినైనా కేబినెట్‌లో తీసుకుంటే కోర్టుకు వెళ్తామన్నారు.

కేంద్ర మంత్రుల్లో నరేంద్రసింగ్‌ తోమర్‌ నాలుగు మంత్రిత్వ శాఖలు; ప్రకాశ్‌ జావడేకర్‌, పీయూష్‌ గోయల్‌, ప్రహ్లాద్‌ జోషి, హర్షవర్ధన్‌ మూడేసి శాఖలు నిర్వహిస్తున్నారు. కొత్త మంత్రులు రానున్న నేపథ్యంలో వీరికి పనిభారం తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హర్షవర్ధన్‌, రమేష్‌ పోఖ్రియాల్‌లకు స్థాన చలనం కలగవచ్చని సమాచారం. ప్రస్తుత సహాయ మంత్రుల్లో 68-69 ఏళ్ల వయసువారైన హర్‌దీప్‌సింగ్‌ పురి, ఆర్‌కే సింగ్‌, అశ్వినీకుమార్‌ చౌబే, జనరల్‌ వీకే సింగ్‌లాంటి వారున్నారు. వీరిలో కొందరిపై వేటువేసి యువతను తీసుకొచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

పరిశీలనలో ఉన్న పేర్లు..
బంగాల్‌: దళిత నేతలు శాంతను ఠాకుర్‌, నిశిత్‌ ప్రామాణిక్‌

మహారాష్ట్ర: మరాఠా నేత నారాయణ్‌రాణే, మాజీ కేంద్రమంత్రి గోపీనాథ్‌ ముండే కుమార్తె ప్రీతమ్‌ ముండే, హీనా గవిట్‌

హరియాణా: బ్రిజేంద్ర సింగ్‌

మధ్యప్రదేశ్‌: రాకేశ్‌ సింగ్‌

ఒడిశా: అశ్వినీ వైష్ణవ్‌

రాజస్థాన్‌: రాహుల్‌ కాస్వా

ఉత్తరాఖండ్‌: తీరథ్‌ సింగ్‌ రావత్‌

కర్ణాటక: ఎ.నారాయణస్వామి, రమేష్‌ జిగజినగితోపాటు, లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన మరో నేత

తమిళనాడు: మిత్రపక్షమైన ఏఐఏడీఎంకె సభ్యులకు అవకాశం ఇవ్వొచ్చు.