విధాత ప్రత్యేకం: శ్రీలంక అధీనంలో కచ్చతీవు ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చింది? సనాతన ధర్మంపై మొన్నటిదాకా అట్టుడికిన తమిళనాడులో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కచ్చతీవు అంశం చుట్టూ అక్కడ రాజకీయం నడుస్తున్నది. లక్షదీవులకు వెళ్లి అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని మాల్దీవుల్లో మంటరేపిన మోదీ.. తాజాగా కచ్చతీవు అంశాన్ని తెరమీదికి తేవడం ద్వారా శ్రీలంక, భారత్ మధ్య వివాదాన్ని సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి యత్నిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
‘మత్స్యకారుల అంశంపై మేము మాట్లాడుకున్నాం. ఈ సంక్లిష్ట సమస్య ఇరువైపులా జీవనోపాధి, మానవత్వానికి సంబంధించినది. ఈ దృష్టి కోణంలో మనం ఈ సమస్యను చూడాలి. అదే సమయంలో ఈ అంశంలో దీర్ఘకాలిక పరిష్కారాన్ని వెతకాలి. దీనికోసం భారత, శ్రీలంక మత్స్యకారుల సంఘాలు ఆమోదయోగ్యమైన అంగీకారం కోసం వీలైనంత త్వరగా సమావేశం కావాలి. ఈ భేటీ అనంతరం ఇరు దేశాల ప్రభుత్వాలను దీన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు.’.. ఇదీ భారత ప్రధాని నరేంద్రమోదీ 2015 మార్చిలో తన మొదటి అధికారిక శ్రీలంక పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలు. ఇదే మోదీ.. తొమ్మిదేళ్ల తర్వాత కచ్చతీవు అంశాన్ని లేవనెత్తారు. ఎన్నికల సమయం కాబట్టి ఈ అంశాన్ని ముందుపెట్టి నెహ్రూను బాధ్యుడిగా చేసి తమిళనాడులో ఓటర్ల భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి, తద్వారా దక్షిణాది రాష్ట్రాల్లోకి అడుగుపెట్టడానికి ప్రధాని తహతహలాడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చోళుల నాటి సెంగోల్ (రాజదండం)ను పార్లమెంటులో పెట్టి.. ఆ పేరుతో ఓట్లడిగేందుకు చేసిన ప్రయత్నం ఫలితాన్ని ఇచ్చేలా కనిపిండచం లేదు. తర్వాత డీఎంకే మంత్రి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మొదలు ప్రధాని వరకు రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మరో భావోద్వేగ అంశంగా ఉన్న కచ్చతీవును తీసుకొచ్చినట్టు కనిపిస్తున్నది.
1970లో కచ్చతీవును శ్రీలంకకు భారతదేశం ఇచ్చేసిందంటూ ప్రధాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంగా కచ్చతీవును వదిలేసిందని ఆరోపించారు. డీఎంకే ద్వంద్వ విధాన ముసుగును ఇది తొలిగించిందని విమర్శించారు. విదేశాంగ మంత్రి జై శంకర్ ఇదే విషయంపై స్పందిస్తూ తమిళ ప్రజలను ఆనాడు తప్పుదోవ పట్టించారని అన్నారు. నెహ్రూ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా తన వాక్చాతుర్యంతో మోదీ చేసిన విమర్శలు తమిళనాడులోని తీర ప్రాంత మత్స్యకార సమాజాన్ని ఆకట్టుకుంటాయా? లేదా? అనేది వేరే విషయం. ద్వీపం కోల్పోవడం కంటే వారికి అత్యంత ప్రధాన అంశం.. 2015లో ప్రధాని శ్రీలంక పర్యటనలో చెప్పిన జీవోనోపాధి-మానవత్వంతో ముడిపడిన ఈ సంక్లిష్ట సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనాలని అన్న మాటలు ఏమయ్యాయన్నదే. దశాబ్దకాలంగా ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సమాధానం దొరకాలంటే భారత్, శ్రీలంక మధ్య 1974-76 మధ్య నాటి సముద్ర సరిహద్దును పరిష్కరించిన ఒప్పందాలను పరిశీలించాల్సి ఉన్నది. మోదీ-జై శంకర్లో గత ప్రభుత్వాన్ని, నాటి నేతలను నిందించి, తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాన్ని పక్కనపెడితే కచ్చతీవును వదులుకున్నందుకు ప్రతిఫలంగా భారత్ ఏం పొందిందో కూడా చూడాలని పరిశీలకులు అంటున్నారు.
ఇందిరాగాంధీ, సిరిమావో బండారునాయకే మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. కచ్చతీవుకు బదులుగా కన్యాకుమారి తీరానికి దూరంలో ఉన్న సముద్ర జలాల్లోని వేజ్ బ్యాంక్పై హక్కులను వదులుకునేందుకు ఆనాడు శ్రీలంక సిద్ధపడింది. కన్యాకుమారి తీర జలాలపై భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఆమోదించింది. పాక్ జలసంధిలోని మానవ రహిత ద్వీపంతో పోల్చితే వ్యూహాత్మకంగా భారత్కు ముఖ్యమైన జలాలపై అందులోనూ మెరైన్ సంపద పుష్కలంగా ఉన్న జలాలపై సార్వభౌమాధికారం పొందడం ఉత్తమమని అప్పట్లో అభిప్రాయాలు వచ్చాయి. కానీ.. మోదీ ప్రభుత్వం ఈ పరస్పర మార్పిడిని మాత్రం ప్రస్తావించడం లేదని రిటైర్డ్ దౌత్యవేత్తలు చెబుతున్నారు. అది మంచి ఉద్దేశంతో జరిగిన ఒడంబడిక అని స్పష్టంచేస్తున్నారు. ఈ ఒప్పందంలో రెండు దేశాలు కొంత లాభం పొంది, కొంత నష్టపోయాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సాగిందని గుర్తు చేస్తున్నారు. కచ్చతీవు బంజరు ద్వీపమని, కానీ.. వేజ్ బ్యాంక్లో చేపల వేటతోపాటు ఇక్కడ లభించే హైడ్రోకార్బన్పై హక్కులు లభించాయని చెబుతున్నారు. అందుకే తదుపరి ఏ ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని వివాదాస్పదం చేయలేదని, మళ్లీ లేవనెత్తాలని కోరుకోలేదని అంటున్నారు. ఆనాడు ఒప్పందం ప్రకారం శ్రీలంక చేపల పడవలు, ఆ దేశ సైనిక నౌకలు వేజ్ బ్యాంకు సమీపంలోకి వచ్చేందుకు అనుమతి లేదు. అయితే.. భారత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు మూడేళ్ల ముందు పరిమిత సంఖ్యలో తాను లైసెన్స్ ఇచ్చిన శ్రీలంక చేపల పడవలు ఇక్కడ చేపలు పట్టుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ అక్కడకు శ్రీలంక చేపల పడవలను అనుమతించలేదు. కచ్చతీవును ఇచ్చి, వేజ్బ్యాంక్పై సార్వభౌమాధికారం పొందడం అనేది అప్పటి క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా తీసుకున్న నిర్ణయమని భారీ మాజీ దౌత్యవేత్త ఒకరు చెప్పారు. నిజానికి భారత మత్స్యకారులను శ్రీలంక నిర్బంధిస్తున్నది కచ్చతీవు వద్ద కాదని, ఇతర ప్రాంతాల్లోనని ఆయన తెలిపారు. కాబట్టి, ఈ రెండు విషయాలను ఒకదానితో ఒకటి ముడిపెట్టడం సరికాదని చెప్పారు.
కచ్చతీవు దీవి తమిళనాడులోని రామేశ్వరానికి ఈశాన్యంగా, శ్రీకలంలోని డెల్ఫ్ట్ దీవికి నైరుతి దిశలో ఉన్నది. దీనికి పొడవు 1.6 కి.మీ, వెడల్పు 300 మీటర్లకు అటూఇటూ ఉండొచ్చని నాటి ప్రధాని నెహ్రూ 1960లో పార్లమెంటుకు చెప్పారు. 1921లో నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ, శ్రీలంక మధ్య కచ్చతీవు దీవి వివాదం తలెత్తింది. అప్పుడు ఈ రెండూ బ్రిటిష్ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. పాక్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ గురించి చర్చించడానికి రెండు వలస ప్రభుత్వాల నేతలు 1921 అక్టోబర్లో కొలంబోలో సమావేశమయ్యారు. సిలోన్ (నేటి శ్రీలంక)కు నాయకత్వం వహించిన కస్టమ్స్ ప్రిన్సిపల్ బీ హర్స్బర్గ్స్ మధ్యస్థ రేఖ (రెండు వైపులా భూమికి సమాన దూరంలో) పశ్చిమ దిశగా మూడుమైళ్లు కచ్చతీవును కలుపుకొని విభజించాలని వాదించారు. ఇది రెండు ప్రభుత్వాల మధ్య గతంలో జరిగిన సంప్రదింపుల్లో భాగమేనని పేర్కొన్నారు. అప్పట్లో దీన్ని భారత్ వ్యతిరేకించలేదని పేర్కొన్నారు.
కచ్చతీవు స్వాతంత్ర్యానికి పూర్వం రామ్నాడ్ పాలకుడి ఆధీనంలో ఉండేదని, ఆ రాజు ఈ దీవిని లీజుకు ఇచ్చి, అద్దె వసూలు చేసుకున్నారని నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ అధికారులు వాదించారు. కనుక ఆ దీవి జమీందారీలోనిదేనని తేల్చి చెప్పారు. కానీ.. దీనిపై ముందుకు వెళ్లే విషయంలో అప్పటి అధికారులకు ఎలాంటి సంకేతాలు లేవు. మరోవైపు సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసిపోయే పరిస్థితి ఉండటంతో వారు రాజీకి అంగీకరించారు. కానీ.. తదుపరి ఆ ఒప్పందాన్ని మద్రాస్ స్టేట్ సెక్రటరీ ర్యాటిఫై చేయకపోవడంతో అమల్లోకి రాలేదు. భారతదేశానికి 1947 ఆగస్టులో శ్రీలంకకు 1948 ఫిబ్రవరిలో స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి ఇరు దేశాల మత్స్యకారులు మార్కింగ్ చేయని జలాల్లో చేపలు పట్టుకుంటూనే ఉన్నారు. అదే సమయంలో ఈ దీవి తమదంటే తమదేననే డిమాండ్లూ ముందుకు వచ్చాయి. శ్రీలంకకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో భారత సంతతికి చెందిన తమిళుల పౌరసత్వంపై ప్రశ్న తలెత్తింది. ఈ సమస్య రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. 1971లో పాకిస్థాన్తో యుద్ధం జరిగి బంగ్లాదేశ్ విముక్తి తర్వాత భారత దేశం శ్రీలంకకు స్నేహహస్తం అందింది. 1974-76 మధ్య రెండు దేశాలు చారిత్రక జలాల్లో సరిహద్దుపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్ , శ్రీలంక మధ్య గల్ఫ్ ఆఫ్ మన్నార్, బే ఆఫ్ బెంగాల్, కచ్చతీవుపై భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక అధ్యక్షురాలు సిరిమావో బండారు నాయకె మధ్య ఒప్పందం కుదిరింది. దీన్ని లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యాక నాటి ప్రభుత్వం పక్రియను పూర్తిచేసింది.
నెహ్రూ ప్రభుత్వం బెరుబారీని తూర్పు పాకిస్థాన్కు బదిలీ చేయాలనుకున్నప్పుడు బీసీ రాయ్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. కరుణానిధి కూడా సుప్రీంకోర్టుకు వెళ్లి ఉండాల్సిందని కొందరు వాదిస్తున్నారు. రాజ్యాంగ సవరణ లేకుండా భూభాగాన్ని మరో దేశానికి బదిలీ చేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే బెరుబారీలా కచ్చతీవు అధికారికంగా ఏ భారతీయ మ్యాప్లో లేదు. అప్పటి విపక్షంలో ఉన్న అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత దీనిపై న్యాయస్థానంలో సవాల్ చేసిన తర్వాత డీఎంకే ప్రభుత్వం చాలా ఏళ్ల తర్వాత కోర్టుకు వెళ్లింది.
భారత దేశానికి, శ్రీలంకకు సరిహద్దు లేదు కనుక పరస్పరం చర్చల ద్వారా 1974-76లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. అంతర్జాతీయ సముద్ర జల సరిహద్దు నిర్ధారించుకున్నారు. దీని ఆధారంగా ఈ దీవి శ్రీలంకవైపు ఉన్నది. దీన్ని తమిళనాడులోని రాజకీయపార్టీలు అంగీకరించవు. అప్పుడప్పుడు అక్కడి పార్టీలు అంశాన్ని లేవనెత్తుతుంటారు. తమిళ సెంటిమెంట్ను తమ రాజకీయాలకోసం వాడుకుంటాయి. కచ్చతీవు ప్రాంతానికి వెళ్లినప్పుడు మన మత్స్యకారులను శ్రీలంక పట్టుకోవడం జరుగుతున్నది. ఇది భావోద్వేగ సెంటిమెంట్కు ఉపయోగపడుతుంది కనుక తమిళ పార్టీలు దీనిపై మాట్లాడుకుంటుంటాయి. తాజాగా దేశ ప్రధాని మోదీ దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి సిద్ధపడ్డారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై శ్రీలంక తీవ్రంగా స్పందించింది. ఇది ఎక్కడిదాకా వెళ్లింది అంటే బలమైన పొరుగు దేశం నుంచి రక్షణ కోసం ఇతర మిత్రులను వెతుక్కోవాల్సి పరిస్థితి ఏర్పడుతుందని శ్రీలంక మీడియాలో కథనాలు వెలులవడే స్థాయికి వెళ్లాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే శ్రీలంక.. చైనా వైపు చూస్తున్నది. ఆ దేశంపై చైనా ప్రభావం చాలా ఉన్నది. ఇది భారత దేశ ప్రయోజనాలకు నష్టం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పటికే మాల్దీవులతో వివాదానికి తోడు బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లోనూ భారత్ వ్యతిరేక భావాలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో శ్రీలంకలో భావోద్వేగాలు రెచ్చగొట్టేలా ప్రధాని, విదేశాంగమంత్రి వ్యాఖ్యలున్నాయని అంటున్నారు.
అయితే కచ్చతీవుపై గత యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఏం చెప్పాయో చూద్దాం. కచ్చతీవు దీవిని భారత్ తిరిగి పొందడం అనే ప్రశ్నే ఉత్పన్నంకాదని 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఎందుకంటే భారతదేశం తన భూభాగాన్ని ఏదీ శ్రీలంకకు వదిలిపెట్టలేదు. అందువల్ల తిరిగి తెచ్చుకోవడం అన్న ప్రశ్న తలెత్తదని కనుక కచ్చతీవు మన దేశానిది కాదు శ్రీలంకదే అని సుప్రీంకోర్టుకు చెప్పింది. దీనంతటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని ఆరోపిస్తున్న బీజేపీ ఏం చేసింది? మోదీ ప్రధాని అయ్యాక ఈ అంశం మద్రాస్ హైకోర్టులో చర్చకు వచ్చింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అఫిడవిట్ సమర్పించింది. కచ్చతీవు దీవిపై శ్రీలంక సార్వభౌమాధికారాన్ని తాము ప్రశ్నించబోమని మోదీ ప్రభుత్వం ఆ అఫిడవిట్లో పేర్కొన్నది. అంతేకాదు 2022లో రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలోనూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి చాలా స్పష్టంగా భారత్, శ్రీలంక అంతర్జాతీయ సముద్ర జల సరిహద్దుకు సమీపంలో కచ్చతీవు శ్రీలంకవైపు ఉంటుందని చెప్పారు. అలాంటి మోదీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేళ మళ్లీ ‘కచ్చతీవు’ వివాదాన్ని తిరిగి ఎందుకు రేపారో సులభంగానే అర్థం చేసుకోవచ్చు.