సంక్రాంతి సంబురాలకు సర్వ సిద్ధం
తెలుగు రాష్ట్రాల ప్రజలు మూడు రోజుల పాటు సంబరంగా జరుపుకునే సంక్రాంతి పండుగకు తెలుగు లోగిళ్లు సిద్ధమవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల ప్రజలు మూడు రోజుల పాటు సంబరంగా జరుపుకునే సంక్రాంతి పండుగకు తెలుగు లోగిళ్లు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి ఇంటే రంగవల్లులు..పతంగులు…గంగిరెద్లుల ఆటలు..హరిదాసు కీర్తనలు…భోగి మంటలు..ఎద్దులు, కోళ్ల పందాల సందడికి వేదికగా భావిస్తారు. అన్ని పండుగలు తిథులను అనుసరించి జరుపుకుంటే ధనుర్మాసంలో వచ్చే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటారు. సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సూర్యుడు ఈ సమయంలో మకర రాశిలోకి ప్రవేశించటం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఈ పండుగను జరుపుకుంటారు. మూడు రోజులుగా సంక్రాంతి పండుగలో తొలి రోజున భోగి, రెండో రోజున మకర సంక్రాంతి, మూడో రోజున కనుమ పేర్లతో పిలుస్తారు. ఉభయ గోదావరి జిల్లాలు సంక్రాంతి పండుగకు ఫేమస్గా చెబుతారు. పల్లెల్లో సంక్రాంతి సంబురాల వేళ ధాన్యలక్ష్మి ఇంటికొచ్చే సమయం కావడంతో రైతు కుటుంబాలు తమ ఇళ్లకు వచ్చే గంగిరెద్దుల వాళ్లకు, హరిదాసులకు ధాన్యం..ధనం దానం చేసి దీవెనలు పొందడం సంస్కృతిగా సాగుతుంది.
సంక్రాంతి పండుగ తొలి రోజున జరుపుకునే భోగి వేడుకల్లో బోగి అనే పదం భుజ్ అనే సంస్కృత పదం నుండి వచ్చిందంటారు. ఆ రోజున తెల్లవారు జామున భోగి మంటలు వేస్తారు. శీతాకాలంలో పేరుకున్న చెత్తను అగ్నిలో కాల్చేవేయటమే భోగి. ఇలా చేయటం వల్ల చెడులు దగ్ధమై తొలగిపోతాయని నమ్మకం. సంక్రాంతిలో నెల రోజుల నుండి చేసిన గొబ్బెమ్మలను పిడకలు చేసి భోగి మంటలలో వేస్తారు. ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేయటం, పాలు పొంగించడం చేస్తారు. సాయంత్రం బొమ్మల కొలువులు పెడతారు. చిన్న పిల్లలకు రేగుపండ్లు, పూలను తలపై పోస్తారు. ఇలా చేయటాన్ని భోగిపండ్లు పోయటం అని అంటారు. ఇది రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో తమను భోగ భాగ్యాలతో ఎప్పటికీ ఇలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యంతో ఇంద్రుణ్ణి, విష్ణువుని పూజిస్తారు. పిల్లలు పతంగులను ఎగురవేయడం ప్రత్యేకత.
రెండవ రోజు మకర సంక్రాంతిని క్రాంతి అనే పదానికి సంస్కృతంలో ముందుకు జరగటమని లేక పురోగమనం..కొత్త వెలుగు దిశగా ప్రయాణం అని భావిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి కదలటం వల్ల మకర సంక్రాంతి అని పిలుస్తారు. బెల్లం..నువ్వులతో చేసే సంక్రాంతి పొంగల్ ప్రత్యేక వంటగా పేరోందింది. ఈ రోజు గాలి పాటలు ఎగుర వేయటం, కోడి, ఎండ్ల పందాలు కాయటం చేస్తారు.
ఆడవాళ్లు ముగ్గులు వేయటం, ముగ్గుల పోటీలు జరుపుకోవటం చేస్తారు. ఈ పండుగరోజు ధాన్యం, వస్త్రాలు, నువ్వులు, దుంపలు, చెరుకు దానం చేస్తారు. స్త్రీలు పసుపు, కుంకుమ, నువ్వుల వంటలు, వస్త్రాలు, వెన్న ఇతరులకు ఇవ్వటం ద్వారా సకల సంపదలు పొందుతారని వారి నమ్మకం.
మూడవ రోజు కనుమ పశు సంతతిని పూజించి గౌరవించే పండుగగా ప్రసిద్ధి. పల్లెలో రైతన్న కష్టంలో సగభాగమై పాడిలో, పంటల సాగులో కీలకంగా ఉండే పశువులను లక్ష్మి స్వరూపాలుగా భావించి, అందంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయటం ద్వారా ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం. ఎద్దుల పందాలు, కోడి పందాలు కూడా ఈ రోజున నిర్వహిస్తారు. సంక్రాంతిని సాగనంపడానికి ఈ రోజున రథం ముగ్గులు కూడా వేస్తారు. కనుమతో సంక్రాంతి పర్వదినాలు ముగుస్తాయి.