K Shanthi | మీ భర్త ఎవరో చెప్పండి ? దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతికి సర్కారు నోటీసులు..!

K Shanthi | సస్పెన్షన్‌కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కే శాంతికి ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. భర్త ఎవరనే విషయంలో స్పష్టత కోరుతూ దేవాదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ నోటీసులు పంపారు.

K Shanthi | మీ భర్త ఎవరో చెప్పండి ? దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతికి సర్కారు నోటీసులు..!

K Shanthi | సస్పెన్షన్‌కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కే శాంతికి ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. భర్త ఎవరనే విషయంలో స్పష్టత కోరుతూ దేవాదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ నోటీసులు పంపారు. దేవాదాయ శాఖలో 2020లో ఉద్యోగంలో చేరిన సమయంలో భర్త పేరును కే మదన్‌మోహన్‌ అని సర్వీస్‌ రిజస్టర్‌లో నమోదు చేయించారు. గతేడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసిన సమయంలో భర్త పేరును మదన్‌ మోహన్‌గా పేర్కొన్నారు. కానీ, ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీ సుభాష్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లుగా చెప్పారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని.. దీనిపై 15రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

ఆమె తీరుతో దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిందని.. వివరణ ఇవ్వాలన్నారు. ఇప్పటికే ఆమెపై పలు ఆరోపణలతో ఈ నెల 2న సస్పెండ్‌ చేసి తొమ్మిది అభియోగాలను నమోదు చేశారు. సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్‌గా పని చేసిన ఉల్లంఘనలకు సంబంధించి తాజాగా ఆరు కొత్త అభియోగాలను మోపారు. అందులో ఒకటి విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్‌మోహన్ అని చెప్పి, వేరొకరిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించడంపై అభియోగం నమోదు చేసింది. ఇక దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ మరో అభియోగం నమోదైంది. కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడడంపై మూడో అభియోగం, ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు తెలుసు సార్.. మీరు పార్టీ వెన్నెముక అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గత ఏడాది మే 28న ట్వీట్ చేశారని, ఇది ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తోందని, ప్రభుత్వ ఉద్యోగిగా ఇది నిబంధనలకు విరుద్ధమంటూ మరో అభియోగం నమోదైంది.

విశాఖపట్నంలో నివాసం ఉన్నప్పుడు అపార్ట్‌మెంట్లోని మరో ఫ్లాట్‌లో నివాసితులతో గొడవపడగా, 2022 ఆగస్టులో అరిలోవ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుపై వివరణ ఇవ్వాలని మరో అభియోగం నమోదు చేశారు. శాంతికి అధికారం లేకపోయినా సరే విశాఖపట్నం జిల్లా పరిధిలో వివిధ ఆలయాలకు చెందిన దుకాణాలు, భూముల లీజులను మూడేళ్లకు బదులు 11 ఏళ్లకు రెన్యువల్ చేసేలా కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపడం, అవి రెన్యువల్ కావడంపై వివరణ కోరుతూ అభియోగం మోపారు. ఇదిలా ఉండగా.. అసిస్టెంట్‌ కమిషనర్‌గా పని చేసిన సమయంలో విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో ఇంకా ఏమైనా ఉల్లంఘనలకు పాల్పడ్డారా? అనే విషయం తేలేసేందుకు ముగ్గురు అధికారులతో కమిటీ వేయనున్నట్లు తెలుస్తున్నది.