టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెలవప్మెంట్ కేసులో వేసుకున్న క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు సంచలనం తీర్పు
– ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు
– సెక్షన్ 17A అంశంపై త్రిసభ్య ధర్మాసనానికి వెళ్లనున్న పిటిషన్
– చంద్రబాబు క్వాష్ పిటిషన్పైభ సుప్రీంకోర్టు తీర్పు
విధాత: టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెలవప్మెంట్ కేసులో వేసుకున్న క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఈ పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు సంచలనం తీర్పు వెల్లడించింది. తనపై చట్ట విరుద్ధంగా కేసు నమోదు చేశారని, తనకు 17ఏ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా నిర్ణయాన్ని వెల్లడించారు. బెంచ్ లో జస్టిస్ అనిరుద్ధ బోస్ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వెల్లడించారు. ఆయన పిటిషన్ సరైనదేనంటూ సమర్థించారు. అనంతరం తన తీర్పు తెలియజేసిన త్రివేది… ఈ కేసులో 17ఏ వర్తించదని అభిప్రాయపడ్డారు. దీంతో చీఫ్ జస్టిస్.. సెక్షన్ 17A అంశంపై త్రిసభ్య ధర్మాసనానికి రెఫర్ చేశారు. గతంలో విచారణ పూర్తయిన తర్వాత అక్టోబర్ 20వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. సుదీర్ఘ కాలంగా రిజర్వ్ లో ఉన్న తీర్పును తాజాగా ఇచ్చారు.
స్కిల్ కేసులో తనకు 17ఏ వర్తిస్తుందన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు పెట్టింది. మొదట ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినప్పటికీ అర్ధరాత్రి అరెస్టు చేసి, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు నమోదు చేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తర్వాత హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ వచ్చింది. కనీస సాక్ష్యాధారాలను కూడా సీఐడీ చూపించలేకపోయిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీనిపైనా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు అక్టోబర్ 18న రిజర్వ్ చేసింది. అప్పటి నుంచి తీర్పు పెండింగ్ లో ఉంది. చంద్రబాబుపై ప్రభుత్వం పెట్టిన ఇబ్బడిముబ్బడి కేసుల గురించి అటు ఏసీబీ కోర్టులో.. ఇటు హైకోర్టులో.. సుప్రీంకోర్టులో అదే పనిగా విచారణకు వస్తున్నాయి. కానీ క్వాష్ పిటిషన్ పై తీర్పు రాని కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరికి చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ కూడా ఈ కారణంగానే వాయిదా పడింది.