Breaking: బీజేపీకి షాక్.. మళ్లీ గులాబీ గూటికి బూడిద భిక్షమయ్య..!
విధాత: మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది బీజేపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆరు నెలల కిందటే ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడి కమలం గూటికి చేరుకున్నారు. ఆరు నెలలు గడవక ముందే అనూహ్యంగా బీజేపీకి రాజీనామా చేశారు. రేపోమాపో మళ్లీ కారెక్కనున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ […]

విధాత: మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది బీజేపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఆరు నెలల కిందటే ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడి కమలం గూటికి చేరుకున్నారు. ఆరు నెలలు గడవక ముందే అనూహ్యంగా బీజేపీకి రాజీనామా చేశారు. రేపోమాపో మళ్లీ కారెక్కనున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ అంశానికి సాయంత్రం వరకు తెరపడే అవకాశం ఉంది.
బీజేపీకి రాజీనామా చేసిన సందర్బంగా భిక్షమయ్య గౌడ్ ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ తెలంగాణ పట్ల బీజేపీ చూపుతున్న వివక్ష, చేస్తున్న అన్యాయాన్ని సహించలేకే ఆ పార్టీకి గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఇంకా బీజేపీలో కొనసాగితే అర్థం లేదన్నారు. తెలంగాణకు బీజేపీ అండగా ఉంటుందన్న హామీతో ఆ పార్టీలో చేరాను. ఆ పార్టీలో చేరినప్పటి నుంచి అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. బీజేపీలో బీసీ నేతలను పట్టించుకునే వారు లేరు.
ప్రధాని , కేంద్రమంత్రులందరూ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అనడమే తప్పా ఒక్క పైసా అదనంగా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం బీజేపీ అధిష్ఠానానికి ఏమాత్రం పట్టులేదు. శాంతియుత వాతావరణం చెడగొట్టేలా నేతలు మాట్లాడుతున్నారు. యాదాద్రి ఆలయానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మిషన్ భగీరథకూ నిధులు ఇవ్వలేదు. ఫ్లోరైడ్ బాధితుల కోసం 300 పడకల ఆస్పత్రి హామీ అతీగతీ లేదని ధ్వజమెత్తారు.
మునుగోడు ఉప ఎన్నికలో బీసీ ఓటర్ల ప్రభావం ఉంటుంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఆయా కులాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీలో బూర నర్సయ్య గౌడ్ చేరిక కూడా ఇందులో భాగమే. అయితే టీఆర్ఎస్ వెంటనే పల్లె రవికుమార్ దంపతులను తమ పార్టీలో చేర్చుకున్నది.
బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీ అధిష్ఠానంపై చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన గులాబీ గూటికి తిరిగి చేరే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కమలం గూటికి వస్తారని ప్రచారం చేసుకున్న ఆ పార్టీకి ఎదురుదెబ్బలే తప్పా ఎవరూ అందులో చేరలేదు.
కాగా, కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన భిక్షమయ్య గౌడ్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా పనిచేశారు.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.
2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో పరాజయం పాలయ్యారు.. అయితే, 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్లో కారును వీడి కమలం గూటికి చేరారు. ఆరు నెలలు గడవక ముందే.. మళ్లీ కారెక్కబోతున్నారని ప్రచారం జరుగుతోంది.