కాంగ్రెస్ తెలంగాణ అభ్యర్థుల ప్రకటనపై రేవంత్రెడ్డి కీలక అప్డేట్
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం హోలీ పండుగలోపు ప్రకటిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు

విధాత: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం హోలీ పండుగలోపు ప్రకటిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నేతలతో ముఖ్యమంత్రి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే ఆ గొప్పతం మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ నాయకులదేనని చెప్పారు.
ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు తనను భుజాలపై మోసి గెలిపించి, ఢిల్లీకి పంపించారని అన్నారు. 2,964 పోలింగ్ కేంద్రాల్లో ప్రతి బూత్లోనూ ఒక సైనికుడిగా కార్యకర్తలు పనిచేశారని గుర్తు చేసుకున్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి అని చెప్పారు. నాడు మల్కాజిగిరిలో తన గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందని చెప్పారు.
కేసీఆర్ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైందన్నారు. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రమంతా తుఫాను వచ్చినట్లు కాంగ్రెస్ గెలిచినా మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని చెప్పారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలు గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేదన్నారు. అందుకే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరాలరి సీఎం చెప్పారు. అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చిందని చెప్పారు. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత తనదని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. మనకు బలమైన నాయకత్వం ఉన్నదని, సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పారు.
మల్కాజిగిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని రేవంత్రెడ్డి చెప్పారు. మెట్రో, ఎంఎంటీఎస్ రావాలన్నా, జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరాలన్నా మల్కాజిగిరి లోక్సభ సీటులో కాంగ్రెస్ను గెలిపించుకోవాలని ప్రజలకు రేవంత్రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. లోక్సభ సీటుతోపాటు.. కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ గెలవాలని చెప్పారు.
వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలను అమలు చేసుకుంటున్నామని తెలిపారు. మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదని చెప్పారు.
ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం
రాబోయే లోక్సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గానికి జరిగే ఎన్నిక అభ్యర్థిది కాదని, ముఖ్యమంత్రిదని చెప్పారు. తన బలం, బలగం ఇక్కడి నాయకులు, కార్యకర్తలేనని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని చెప్పారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలని, పోలింగ్ బూత్ల వారీగా పని విభజన చేసుకుని సమీక్ష చేసుకోవాలని సూచించారు. ప్రతి రోజూ ఉ దయం ఏడు గంటలకే నాయకుల బస్తీలబాట పట్టాలని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించుకోవాలన్న సీఎం.. మల్కాజిగిరి క్యాంపెయిన్ మోడల్ రాష్ట్రమంతా అనుసరించేలా నిర్వహించాలని కోరారు.