కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇళ్ల పథకానికి ఉచితంగానే ఇసుక
కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొంత అవసరాలకు, ఇళ్ల పథకానికి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర గనుల శాఖ ఆదేశాలిచ్చింది.

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొంత అవసరాలకు, ఇళ్ల పథకానికి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర గనుల శాఖ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు.
వివిధ గ్రామాల నుంచి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలంటే వరుసగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకకు ఉచితంగా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతిస్తారు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.