ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
బస్తర్లో ముమ్మరంగా కూంబింగ్.. ఆదివాసీల్లో అలజడి
రాయపూర్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ జిల్లాలోని కోయిలబేడా అడవుల్లోని హూర్తాలాయ్ గ్రామ పరిసరాల్లో ఆదివారం పోలీసు- నక్సల్స్ మధ్య సాగిన భీకర ఎన్ కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారని జిల్లా ఎస్పీ ఐకే ఎలిసెలా తెలిపారు. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజునుండే పోలీసుల కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరం చేశారు. అడవులను జల్లెడ పడుతూ గాలింపు చర్యలు తీవ్రతరం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆదివారం మద్యాహ్నం కాంకేర్ జిల్లా కోయిలాబేడా అడవుల్లోని, హూర్తాలాయ్ పరిసరాల్లో నక్సల్స్ సమావేశమయ్యారన్న సమాచారాన్ని అందుకొన్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య అర్ధ గంట వరకు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారని కాంకేర్ జిల్లా పోలీసు ఎస్పీ ఐకే. ఎలిసెలా మీడియాకు తెలిపారు. ఎదురు కాల్పుల అనంతరం చేపట్టిన గాలింపు చర్యల్లో ఘటనా స్థలంలో మూడు మృత దేహాలను స్వాధీనం చేసుకొన్నట్లు చెప్పారు. నక్సల్స్కు చెందిన రెండు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే మృతి చెందిన నక్సల్స్ ను ఇంకా గుర్తించలేదని ఎస్పీ తెలిపారు. పారిపోయిన మావోయిస్టుల కోసం అదనపు బలగాలతో కూంబింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.
రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ లోని సుక్మా జిల్లాలో శనివారం సాయంత్రం బురక లంకా అడవుల్లో పోలీసులు, నక్సల్స్ మధ్య జరిగిన మరో ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయాడని పోలీసులు తెలిపారు. చనిపోయిన మవోయిస్టు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఇది ఇలా వుంటే అదే సుక్మా జిల్లాలోమావోయిస్టులు ఇరువురు గ్రామీణులను పోలీసు ఇన్ ఫార్మర్ల ఆరోపణలతో హత్య జేశారు. పామేడ్ ఏరియా కమిటీ దీని దీనికి బాధ్యత తీసుకొంటూ గ్రామీణులను పోలీసులకు దూరంగా వుండాలని కోరింది.
పోలీసులకు –నక్సల్స్కు మధ్య ఇలా వరుస ఘటనల మధ్య ఆ రాష్ట్ర డిప్యూటీ ముఖ్య మంత్రి, హోం మంత్రి విజయ శర్మ నక్సల్స్ స్థావరమైన సిలింగేర్ ప్రాంతాన్ని పర్యటించి పోలీసు బలగాలకు అవసరమైన సూచనలు , సలహాలు ఇచ్చి వెళ్ళారు. ఆ తరువాత కొద్ది రోజులకే మోస్ట్ వాంటెడ్ నక్సల్ హిడ్మా సొంత గ్రామంలో పోలీసు, సీఆర్ఫీఎఫ్ క్యాంపు కొత్తగా ఏర్పాటు చేశారు. ఇలా పోలీసు –నక్సల్స్ మధ్య ఒకరి పై ఒకరు దాడికి ప్రతి దాడికి దిగుతుండడంతో బస్తర్ ప్రాంత ఆదివాసుల్లో తీవ్ర భయాందోళనలు చోటు చేసుకొంటున్నాయని, అంతేకాదు కొందరు గ్రామీణులు గ్రామాలు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నట్లు బస్తర్ ఆదివాసీ సమాజ్ నాయకులు ఒక ప్రకటన లో తెలియజేశారు.