విధాత, హైదరాబాద్ : ఐటీ ఎగుమతులు 2లక్షల50 వేల కోట్ల నుంచి ఐదేళ్లలో రెండింతలు చేస్తామని ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధర్బాబు అన్నారు. ఐటీని రెండు మూడు దశల్లో విస్తరణ చేసే ఆలోచనలో ఉన్నామని, వరంగల్ లో కూడా ఐటీ పార్కును మరింత అభివృద్ధి చేస్తామన్నారు. బుధవారం మంత్రి శ్రీధర్బాబుతో జపాన్కు చెందిన మరుబెని కార్పొరేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న సహకారం గురించి వారికి మంత్రి వివరించారు. ఫార్మా ఇండస్ట్రీ పూర్తిగా రెడ్ జోన్ అని, పొల్యూషన్ ఎక్కువ కాబట్టి క్లస్టర్లు ఏర్పాటు చేసి విభజిస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. నల్లగొండలో డ్రై పోర్ట్ ప్రపోజల్ పెడుతున్నామని వెల్లడించారు. బెంగళూరు హైవేలో ఐటీ కారిడార్ తీసుకొస్తామని, దీనికి కర్ణాటక ప్రభుత్వంతో కూడా మాట్లాడి ముందుకు వెళుతామని తెలిపారు. బయో ఆసియా ఈ నెల 26నుంచి 28వరకు ఉంటుందని, దానిని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. జపాన్ సంస్థల ఇండస్ట్రియల్ పార్కు కోసం ఎల్బీ నగర్ వైపు 800 ఎకరాల్లో ప్రత్యేక కారిడార్ ఏర్పాటు ఆలోచన చేస్తున్నామన్నారు. ఏ జిల్లాలో ఏయే కంపనీలు పెట్టాలన్నదానిపై కసరత్తు చేస్తున్నామని, త్రిబుల్ ఆర్ లోపల, బయట అభివృద్ధి, కంపెనీల ఏర్పాటుకు రిపోర్టు కోసం ఓ సంస్థకు అప్పగించామని మంత్రి వెల్లడించారు.