సినీ ప్రియులకి కిక్ ఇస్తున్న రీ రిలీజ్లు.. రానున్న రోజులలో ఎన్ని సినిమాలు రానున్నాయంటే..!

ఇటీవల రీ రిలీజ్ల ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవైపు మంచి చిత్రాలు థియేటర్స్లో సందడి చేస్తున్నా కూడా పలువురు హీరోల సినిమాలని రీ రిలీజ్ చేస్తూ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. లవర్స్ డే సందర్భంగా చాలా సినిమాలు రీ రిలీజ్ అయి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచాయి. ఎ కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన తొలి ప్రేమ చిత్రంతో పాటు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన సీతారామం అనే ప్రేమ కథా చిత్రం కూడా వ్యాలంటైన్స్ డేకి రీ రిలీజ్ అయింది. ఇక వీటితో పాటు సిద్ధార్థ్, షామిలి ప్రధాన పాత్రలలో నటించిన ఓయ్ అనే రొమాంటిక్ డ్రామా , గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, మరియు విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో రూపొందిన బేబి చిత్రాలు రీ రిలీజ్ అయి ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి.
హిందీ మూవీ దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే మూవీ కూడా ప్రేమికుల రోజున విడుదలై సందడి చేసింది. చిత్రంలో షారూఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించగా, ఇది ఎంతగానో అలరించింది. ఇక హాలీవుడ్లో లవ్ స్టోరీస్లో కల్ట్ క్లాసిక్ మూవీ `టైటానిక్`ని కూడా రీరిలీజ్ చేశారు. మొత్తానికి వ్యాలంటైన్స్ డే రోజు చాలా ప్రేమ కథా చిత్రాలు రీరిలీజ్ అయి ప్రేక్షకులకి మంచి కనువిందు చేశాయి. అయితే రానున్న ఈ రెండు నెలల్లోనే మరిన్ని చిత్రాలు రీ రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ముందుగా వాటిలో చూస్తే మాస్ మహారాజ్ రవితేజ నటించిన చిత్రాలు రెండు ఉండడం విశేషం.
రవితేజ నటించిన క్రేజీ ఎంటర్టైనర్ చిత్రం “దుబాయ్ శీను” ఈ ఫిబ్రవరి 24,25 తేదీలలో రిలీజ్ అవుతుండగా, ఇక మార్చ్ 1న “కిక్” రీ రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రాలతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “వర్షం” ఈ ఫిబ్రవరి 17,18 తేదీలలో సందడి చేయనుంది. ఇక సిద్దార్థ్ నటించిన “ఓయ్” థియేటర్స్ లో ఉండగానే తన మరో బిగ్ హిట్ “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” చిత్రం కూడా సేమ్ తేదీలలో రిలీజ్ అయి ప్రేక్షకులకి మంచి వినోదం పంచనుంది. ఇక ఈ చిత్రాలతో పాటు మరి కొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్ అయి ప్రేక్షకులకి కావలసినంత ఆనందం పంచబోతున్నట్టు తెలుస్తుంది.