Supreme Court | ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేందర్ జైన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఇప్పటి వరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్లన్నీ తిరస్కరణకు గురయ్యారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై జైలు నుంచి విడుదలైన ఆయనను వెంటనే లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సత్యేందర్ జైన్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించగా.. జస్టిస్ బేల ఎం త్రివేది, పంకజ్ మిథాల్లతో కూడిన ధర్మాసనం జనవరి 17న తీర్పును రిజర్వ్ చేసింది. గతేడాది డిసెంబర్ 14న వైద్యపరమైన కారణాలతో కేసులో ఆప్ ప్రభుత్వ మాజీ మంత్రి జైన్కు మంజూరైన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు జనవరి 8 వరకు పొడిగించింది.
మే 26న వైద్యపరమైన కారణాలతో జైన్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాన్ని పొడిగిస్తూ వచ్చింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ 2023 ఏప్రిల్ 6న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మాజీ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్ పాల్పడ్డారని ఆయనపై ఈడీ మే 30న, 2022న అరెస్టు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద జైన్పై 2017లో నమోదైన సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అరెస్ట్ చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసులో జైన్కు ట్రయల్ కోర్టు 6 సెప్టెంబర్ 2019న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆయన ఈడీ కేసులో కోర్టు బెయిల్ను ఇచ్చేందుకు నిరాకరించింది.