నగరంలో అంతర్జాతీయ మొబైల్ స్నాచింగ్ ముఠాను సౌత్ జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు
విధాత, హైదరాబాద్ : నగరంలో అంతర్జాతీయ మొబైల్ స్నాచింగ్ ముఠాను సౌత్ జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ముఠాకు చెందిన ఐదుగురు సూడాన్ దేశస్థులతో సహా 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా, వారిలో 12మంది నిందితులు హైదరాబాద్కు చెందిన వారని తెలిపారు. వారి నుంచి రూ.1.75 కోట్ల విలువైన 703 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. దొంగిలించిన సెల్ ఫోన్లనలు సముద్ర మార్గం ద్వారా సూడాన్ తరలిస్తున్నారని, విమానాశ్రయాల్లో అయితే నిఘా ఎక్కువగా ఉంటుందని, పడవల్లో వాటిని తీసుకెళ్తున్నారని వివరించారు.. రాత్రి సమయంలో నడుచుకుంటూ వెళుతున్న వారిని మొబైల్ స్నాచింగ్ ముఠా టార్గెట్ చేస్తున్నారని, కొన్ని సందర్భాల్లో వారిని మాటల్లో పెట్టి మొబైల్ స్నాచింగ్, నగదు చోరీ చేస్తున్నారని తెలిపారు. ఎక్కువగా రాత్రి 10 గంటలు తర్వాత స్నాచింగ్స్ జరుగుతున్నట్టు గుర్తించామని, మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ స్నాచింగ్ జరుగుతున్నదని చెప్పారు. చోరికి గురైన, దెబ్బతిన్న సెల్ ఫోన్లను అబిడ్స్ లోని జగదీశ్ మార్కెట్లో విక్రయిస్తున్నారని తెలిపారు. దెబ్బతిన్న ఫోన్లను అక్కడే డిస్మెంట్ చేస్తున్నారన్నారు. ఓ వ్యక్తి జగదీశ్ మార్కెట్లో ఇలాంటి ఫోన్ల కోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటు చేశాడని తెలిపారు.