దక్షిణ ఢిల్లీలో జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘాల్ (29) హత్య తీవ్ర సంచలనంగా మారింది. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటల మీద ఉండాల్సిన వరుడు హత్యకు గురయ్యాడు
న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలో జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘాల్ (29) హత్య తీవ్ర సంచలనంగా మారింది. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటల మీద ఉండాల్సిన వరుడు హత్యకు గురయ్యాడు. గౌరవ సింఘాల్ను అతని తండ్రే అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తండ్రి రంగలాల్ను పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. గౌరవ్ తనను రోజూ దుర్భాషలాడుతుండటంతో కోపంతో కొడుకును చంపాడని పోలీసులు వెల్లడించారు. గౌరవ్ అతడి ఇంట్లోనే అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. తెల్లవారితే అతడి పెళ్లి. ఈ సమయంలోనే తండ్రి చేతిలో హత్యకు గురవడం సంచలనంగా మారింది. హత్య తర్వాత పరారీలో ఉన్న నిందితుడు రంగలాల్ను పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో పోలీసులకు హత్య గురించి ఫోన్ వచ్చింది. సంఘటన స్థలంలోకి వెళ్లేసరికి గౌరవ్ రక్తపు మడుగులో పడిఉన్నాడు. అతడి ముఖం, ఛాతీపై 15 కత్తిపోట్లు ఉన్నాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. హత్య తరువాత మృతదేహాన్ని దాచేందుకు కూడా హంతకుడు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గౌరవ్ పెళ్లి వేడుక శుక్రవారం జరగాల్సి ఉంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే గౌరవం మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ కుటుంబ సభ్యుల ఒత్తిడితో పెళ్లికి అంగీకరించాడనే అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ విషయం పై గౌరవ్, తన తండ్రితో పలుమార్లు వాగ్వివాదానికి దిగాడని సమాచారం. ఈ క్రమంలోనే గౌరవ్ తన తండ్రిని చెప్పుతో కొట్టాడని తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన రంగలాల్ తన ముగ్గురు సహచరులతో కలిసి గౌరవ్ను హత్య చేసి, 50 లక్షల నగదు, 15 లక్షల విలువైన బంగారంతో ఇంటి నుంచి పారిపోయాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.