దేశంలో 24 గంటల్లో 752 కొత్త కోవిడ్ కేసులు
భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 752 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 నాటి నుంచి ఇదే అత్యధిక కొవిడ్ కేసుల సంఖ్య

- మూడు రాష్ట్రాల్లో నలుగురు మృతి
- కేరళలో ఇద్దరు, రాజస్థాన్, కర్ణాటకలో
- ఒక్కరు చొప్పున: కేంద్రఆరోగ్య శాఖ
- తెలంగాణలో 27 కేసులు నమోదు
విధాత: భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 752 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 నాటి నుంచి ఇదే అత్యధిక కొవిడ్ కేసుల సంఖ్య. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. ఒక్కరోజులోనే కరోనా కారణంగా మరో నలుగురు మరణించారు. కేరళలో ఇద్దరు, రాజస్థాన్, కర్ణాటకలో ఒక్కరు చొప్పున చనిపోయినట్టు శనివారం ఉదయం వెల్లడించిన డాటాలో ఆ శాఖ తెలిపింది. నాలుగు కొత్త మరణాలతో ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,332గా నమోదైంది .
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,71,212కి పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉన్నది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదయింది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్ల కొవిడ్ వ్యాక్సిన్ను అందించినట్లు మంత్రిత్వశాఖ వెబ్సైట్ తెలిపింది.
తెలంగాణలో 27 కేసులు
తెలంగాణలో శుక్రవారం మరో ఎనిమిది కొత్త కేసులు నమోదయ్యాయి. కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గతంలో 19 ఉండగా.. కొత్త కేసులతో ఆ సంఖ్య 27కు చేరినట్టయింది. ఒక్కరోజే 1245 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఎనిమిది మందికి పాజిటివ్గా తేలింది. హైదరాబాద్లో ఏడుగురికి, రంగారెడ్డిలో ఒకరికి కరోనా పాజిటివ్గా తేలింది. నిలోఫర్ ఆస్పత్రిలో రెండు నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా.. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.