Blood Pressure | విధాత: వైద్య పరిభాషలో సైలెంట్ కిల్లర్గా పిలుచుకునే అధిక రక్తపోటు వల్ల కలిగే నష్టాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి వెల్లడించింది. దీని వల్ల ఎంత మంది ప్రాణాలకు ముప్పు ఉందని అంచనా వేస్తూ తొలిసారి ఈ తరహా నివేదికను రూపొందించింది. ప్రపంచ జనాభాలో ప్రతి అయిదుగురు రక్తపోటు బాధితుల్లో నలుగురికి సరైన చికిత్స అందడం లేదని ఇందులో పేర్కొంది. ప్రభుత్వాలన్నీ రక్తపోటుతో బాధపడేవారిని గుర్తించి సరైన చికిత్స అందిస్తే 2050 […]
Blood Pressure |
విధాత: వైద్య పరిభాషలో సైలెంట్ కిల్లర్గా పిలుచుకునే అధిక రక్తపోటు వల్ల కలిగే నష్టాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి వెల్లడించింది. దీని వల్ల ఎంత మంది ప్రాణాలకు ముప్పు ఉందని అంచనా వేస్తూ తొలిసారి ఈ తరహా నివేదికను రూపొందించింది. ప్రపంచ జనాభాలో ప్రతి అయిదుగురు రక్తపోటు బాధితుల్లో నలుగురికి సరైన చికిత్స అందడం లేదని ఇందులో పేర్కొంది.
ప్రభుత్వాలన్నీ రక్తపోటుతో బాధపడేవారిని గుర్తించి సరైన చికిత్స అందిస్తే 2050 నాటికి ఏడు కోట్ల అకాల మరణాలను నివారించొచ్చని తెలిపింది. భారత్ (India)లో సైతం ప్రభుత్వం సరైన చర్యలు చేపడితే నాలుగు కోట్ల చావులను ఆపగలమని పేర్కొంది. దీనికోసం 30 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్న సగం జనాభా తమ రక్తపోటును నిర్ణీత పరిమితుల్లో పెట్టుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
మంగళవారం జరిగిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశంలో ఈ నివేదికను వెలువరించింది. ఈ నివేదిక ప్రకారం.. రక్తపోటు వల్ల సంభవించే మరణాలను సగానికి తగ్గించాలనుకుంటే ఇప్పటి నుంచి 6.7 కోట్ల మంది రక్తపోటు బాధితులకు సరైన చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. బీపీ 140 / 90ను ఆధారాంగా చేసుకుని డబ్ల్యూహెచ్ఓ ఈ నివేదికను రూపొందించింది.
సైలెంట్గా ప్రాణాలు తీసే ఈ రక్తపోటు వల్ల స్ట్రోక్, హార్ట్ ఎటాక్, గుండె విఫలం, మూత్రపిండాలు పనిచేయకపోవడం, ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సరైన పోషకాహారం తీసుకోవడం, శారీరక శ్రమ, ఒత్తిడిని అదుపులో పెట్టుకోవడం, రక్తపోటును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ జాగ్రత్తలు పాటించడం మొదలైన చర్యలు బీపీ ముప్పును తప్పిస్తాయి.