సౌతాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోగా, 8 ఏండ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది.
జొహెన్నెస్బర్గ్ : సౌతాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోగా, 8 ఏండ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈస్టర్ పండుగ నేపథ్యంలో చర్చికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు నిర్ధారించారు. 165 అడుగుల లోతులో బస్సు పడిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు.
మొత్తం 46 మందితో కూడిన బస్సు బోట్స్వానా నుంచి మోరియాకు బయల్దేరింది. అక్కడున్న కొండపై నిర్మించిన వంతెన క్రాసింగ్ వద్ద బస్సు అదుపుతప్పింది. దీంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 45 మంది మృతి చెందారు. ప్రాణాలతో బయటపడ్డ 8 ఏండ్ల బాలికను సమీప ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇక ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోయలో నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. మంటల ధాటికి మృతదేహాలన్ని పూర్తిగా కాలిపోయాయి. దీంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. ఈ ప్రమాద ఘటనపై బోట్స్వానా అధ్యక్షుడు, సౌతాఫ్రికా అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రయాణికులు వెళ్లాలనుకున్న జియాన్ చర్చ్ ఆ దేశంలో ఉన్న అతిపెద్ద చర్చిల్లో ఒకటి అని పేర్కొన్నారు.