విధాత: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహేంద్రగడ్ సమీపంలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతివేగంతో ప్రయాణిస్తున్న బస్సు వేరే వాహనాన్ని దాటేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో బస్సు పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రోధనలు మిన్నంటాయి. ఘటనపై స్థానికి ఎస్పీ మాట్లాడుతూ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని ప్రమాద సమయంలో మద్యం సేవించాడా లేదా అని వైద్య పరీక్షలు చేసేందుకు తీసుకువెళ్లామన్నారు. మద్యం సేవించడం మూలంగా ప్రమాదం జరిగిందా లేదా అన్న విషయంతో రిపోర్ట్ తయారు చేయాలన్నారు. అయితే బస్సు ఆరు సంవత్సరాల క్రితమే ఫిట్నెస్ కోల్పోయిందన్నారు. కాలపరిమితి లేని బస్సుని ఉపయోగించడంతో పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశామన్నారు.