ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో మారణ హోమం జరిగింది. మూడు గ్రామాలపై వారం రోజుల క్రితం జరిగిన దాడుల్లో 170 మందిని కిరాతకంగా చంపేసినట్లు
బుర్కినా ఫాసో: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో మారణ హోమం జరిగింది. మూడు గ్రామాలపై వారం రోజుల క్రితం జరిగిన దాడుల్లో 170 మందిని కిరాతకంగా చంపేసినట్లు ప్రాంతీయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదివారం తెలిపారు. ఫిబ్రవరి 25న యటెంగా ప్రావిన్స్లోని కొంసిల్గా, నోడిన్, సోరో గ్రామాలపై జరిగిన దాడులకు సంబంధించి నివేదికలు అందాయని, దాదాపుగా 170 మందికి మరణశిక్ష విధించారని అలీ బెంజమిన్ కౌలి బాలి చెప్పారు. ఈ ఘటనపై తమ కార్యాలయం విచారణకు ఆదేశించిందని తెలిపారు. బాధితుల్లో డజన్ల కొద్ది మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని దాడుల నుంచి బయటపడిన వారు చెప్పారు. వారం క్రితం ఉత్తర బుర్కినా ఫాసోలోని మసీదు, చర్చిలపై దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో ఎంతమంది మరణించారనే వివరాలను అధికారులు అధికారికంగా వెల్లడించలేదు.
బుర్కినా ఫాసో 2015 నుంచి ఇస్లామిక్ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నది. మాలి దేశం నుంచి అల్ కాయిదా, ఇస్లామిక్ స్టేట్తో సంబంధం ఉన్న తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ హింస కారణంగా దాదాపుగా 20వేల మంది మరణించారు. 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రపంచంలో అత్యంత పేద దేశంగా ఉన్న బుర్కినా ఫాసో అస్థిరతతో కొట్టు మిట్టాడుతోంది. 2022లో జరిగిన రెండు సైనిక తిరుగుబాట్లు దేశ భద్రతను ప్రశ్నార్థకంగా మార్చాయి. నిరు పేద దేశమైన బుర్కినా ఫాసోపై ఈ యుద్ధ అస్థిరత, భారం కోలుకోలేని విధంగా తయారవుతున్నది. దానితో దేశం మరింత ఆర్థిక, రాజకీయ సంక్షోభంలోకి కూరుకుపోతున్నది.