ఇనుము తిన్న ఇంటి దొంగలు ?
ప్రభుత్వ స్థలాలు..ఆస్తులను కాపాడాల్సిన అధికారులు ప్రేక్షక పాత్రకు పరిమితమవ్వడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆస్తులు, స్థలాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి

- లక్షల రూపాయల మోటార్స్ ఐరన్ ట్రాక్ అపహరణ
విధాత : ప్రభుత్వ స్థలాలు.. ఆస్తులను కాపాడాల్సిన అధికారులు ప్రేక్షక పాత్రకు పరిమితమవ్వడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆస్తులు, స్థలాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. తాజాగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని నీటి సరఫరా డివిన్కు సంబంధించి నీటి మోటార్ల ఇనుప ట్రాక్లైన్ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. వివరాల్లోకి వెళితే హిల్ కాలని పాత ఫిల్టర్ హౌస్ దిగువ భాగాన గతంలో నీటిని పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగేది. నూతనంగా పైలాన్ కాలనీలో ఫిల్టర్ హౌస్ ఏర్పాటు చేసిన తర్వాత హిల్ కాలని ఫిల్టర్ హౌస్ నుండి నీటిని సరఫరా చేయడం ఆగిపోయింది.
అయితే నీటి సరఫరా విభాగానికి చెందిన ఏఈ స్థాయి అధికారి కార్యాలయం ,కార్యాలయ సిబ్బంది అక్కడే తమ విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యాలయం కింద భాగాన కృష్ణ నది ఒడ్డున నుండి పై వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేరకు నీటి మోటర్ ను నీటిమట్టం పెరిగినప్పుడు తగ్గినప్పుడు పైకి కిందికి తీసుకొచ్చే విధంగా ఇనుప స్తంభాలతో ఐరన్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. అయితే ఆ ఐరన్ ట్రాక్లను గత కొంతకాలంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కోక్కటిగా మాయం చేయడం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా ఒకటిన్నర కిలోమీటర్ పైగా స్తంభాల ట్రాకులను ముక్కలు ముక్కలుగా కట్ చేసి అపహరించారు.
ఇంటిదొంగలపైనే అనుమానాలు
ఇనుప ట్రాక్ను ఏకంగా గ్యాస్ కట్టర్తో కట్ చేసి మరి వాటి అపహరణకు పాల్గొనడంతో ఈ చోరి బయటి వారి పని కాదని ఎన్ఎస్పీ పరిధిలోని సంబంధిత నీటి సరఫరా అధికారులు, సిబ్బంది సహకారంతోనే జరిగి ఉంటుందని స్థానికులు అనుకుంటున్నారు. లక్షల రూపాయలు విలువ చేసే ఐరన్ ట్రాక్ను ముక్కలు ముక్కలుగా చేసి కృష్ణానది ఒడ్డున నుండి పైకి తీసుకురావడం. అక్కడనుండి ట్రాలీలలో ఇతర ప్రాంతాలకు తరలించడం అంత సులభతరమైన పని కాదు. స్థానికంగా ఉండే అధికారుల, స్థానికుల సహకారం లేకుండా జరిగే పని కాదు.
గత రెండు రోజుల క్రితం కొందరు స్థానికులు ఈ వ్యవహారాన్ని గుర్తించి స్థానిక సంబంధిత అధికారులకు తెలియజేసినప్పటికి వారు సకాలంలో స్పందించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కొంతమంది స్థానికులు ఈ విషయాన్ని ఉన్నతా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో కంటి తుడుపు చర్యగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ విషయంలో ఎన్ఎస్పీ ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేపట్టి అపహరించిన వ్యక్తులను, వారికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.